Tuesday, 30 September 2025

 5️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.*  


*72. ఏషా బ్రాహ్మీస్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతిl*
 *స్థిత్వా2స్యా మన్తకాలే2పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతిll*

ఓ పార్థా! దీనినే బ్రాహ్మీస్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన వాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలములో కూడా ఈ బ్రాహ్మీస్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని పరమ శాంతిని పొందుతాడు.

స్థితప్రజ్ఞుడు పొందే ఈ స్థితిని బ్రాహ్మీస్థితి అని అన్నాడు వ్యాసుడు. ఈ స్థితి ఒక రోజు ఉండి మరురోజు పోయేది కాదు. మరణించే దాకా ఉంటుంది. అతడు మరణానికి భయపడడు. ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. కాని కొంత మంది జీవితంఅంతా ప్రాపంచికసుఖాలతో గడిపి, అంత్యకాలంలో భగవంతుని సేవించి, బ్రాహ్మీస్థితిని పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. నిరంతర అభ్యాసము చేత గానీ ఈ బ్రాహ్మీస్థితి సిద్ధించదు. కాబట్టి అంత్యకాలము సమీపించినపుడు లేక 60 దాటాక చూచుకుందాములే అని కాకుండా ఇప్పుడే ఈ క్షణము నుండి ప్రతి వాడూ ఈ బ్రాహ్మీస్థితి లక్షణములను పొందడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి.

వేదాంత జ్ఞానము చేత ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగిందో దానినే బ్రాహ్మీస్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రములో కలిస్తే ఇంక నది ఉండదు. సముద్రమే ఉంటుంది. పాలలో నీళ్లు పోస్తే అవి పాలు అవుతాయి నీళ్లు కనిపించవు. అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రాహ్మీస్థితిని పొందుతాడు. అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనపడవు. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన తరువాత ఎవరూ మోహములో పడరు. కోరికలు ఉండవు. ఏదీ కావాలని కోరుకోడు. ఇది నాది అది నీది అనే భ్రమలో పడడు. ఈ ప్రపంచం అంతా నాటకం. అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు కానీ అందులో లీనం కాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాము. పెద్ద అయిన తరువాత బొమ్మల మొహం కూడా చూడము. ఎందుకంటే మన స్థితి మారిపోయింది. చిన్నప్పుడు మనకు బొమ్మల మీద ఆసక్తి ఉంటుంది. పెద్ద అయిన తరువాత ఆ ఆసక్తి ఉండదు. అలాగే బ్రాహ్మీస్థితిని చేరుకున్న తరువాత సాధకుడు నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే జీవిత కాలంలో ఈ బ్రాహ్మీస్థితి చేరుకున్నాడో, అతడు బ్రహ్మానందమును పొందుతాడు. జననమరణ చక్రము నుండి విముక్తి పొందుతాడు. అతడే జీవన్ముక్తుడు. తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు.

దీనితో రెండు అధ్యాయాలుపూర్తి అయ్యాయి. ఇప్పుడు ఒక సారి సింహావలోకనం చేసుకుందాము. సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెబుతున్నాడు. దృతరాష్ట్రుడు సంజయునితో, యుద్ధమునకు సన్నద్ధము అయిన నా వాళ్లు, పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారు అని అడగడంతో భగవద్గీత మొదలవుతుంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. ముందు సుయోధనుడు ద్రోణుని వద్దకు పోయి ఇరుపక్షముల వీరులను పరిచయం చేసాడు. అపుడు భీష్ముడు, అతని పక్షమువారు, కృష్ణార్జునులు అతని పక్షమువారు శంఖములు పూరించుకున్నారు. అర్జునుడు తన రథ సారధి అయిన కృష్ణునితో రథమును ఇరు పక్షముల మధ్యలో నిలబెట్ట మన్నాడు. కృష్ణుడు రథమును ఇరుసైన్యముల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షము వారిని, ఎదుటి పక్షములో ఉన్న తాత భీష్ముడు, గురువు ద్రోణకృపాచార్యులను, అశ్వత్థామను తన సోదరులను, బంధుమిత్రులను చూచాడు. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. చేతులు వణికాయి. అవయవములు పట్టుతప్పాయి. నోరు ఎండిపోయంది. శరీరం గగుర్పాటు చెందింది. గాండీవము చేతులో నుండి జారి పోయింది. రథం మీద నిలబడలేకపోయాడు.

అప్పుడు కృష్ణునితో ఇలా అన్నాడు. "కృష్ణా! ఈ యుద్ధములో నా బంధువులను గురువులను మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాజ్యము, విజయము అక్కరలేదు. వీరందరినీ చంపి నేను సుఖములను ఎలా అనుభవించాలి. కాబట్టి నాకు మూడు లోకముల ఆధిపత్యము వచ్చినా సరే ఈ యుద్ధము చేయను. వీరందరూ ఆతతాయలు దుర్మార్గులు అయినా సరే వీళ్లను చంపి నేను పాపం మూటకట్టుకోలేను. వీళ్లందరూ మరణిస్తే వీళ్ల కులములలో మగాళ్లు ఉండరు. అప్పుడు వర్ణసంకరం జరగడానికి అవకాశం ఉంది. వర్ణసంకరం జరిగితే వీళ్ల పితృదేవతలకు పిండప్రదానము చేసేవారు ఉండరు. ఆ విధంగా సనాతన ధర్మములు, కుల ధర్మములు నాశనమైపోతాయి. అటువంటివారికి నరకం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానము కలిగిన నేను ఈ ఘోరానికి పాల్పడలేను. అందుకని నేను అస్త్రసన్యాసము చేస్తాను. వీళ్లు నన్ను చంపినా సరే నాకు క్షేమమే అవుతుంది." అని ధనుర్బాణములను రథం మీదపెట్టి చతికిల పడ్డాడు.

కళ్లతో నీళ్లతో కరుణతో కూడిన హృదయంతో, శోకిస్తున్న అర్జునుని చూచి కృష్ణుడు జాలి పడి ఇలా అన్నాడు. "అర్జునా నీవు మహా వీరుడవు. అత్యుత్తమ ధనార్ధారివి. నీకు ఈ పిరికితనము, నపుంసకత్వము ఎక్కడి నుండి దాపురించాయి. ఇది నీకు ఉచితము కాదు. కాబట్టి ఈ దుర్బలత్వము వదిలి యుద్ధం చేయి" అని అన్నాడు.

అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. "కృష్ణా! ఎదురుగా ఎవరున్నారో చూచావా! మా తాత భీష్ముడు, విద్య నేర్పిన గురువులు, గురు పుత్రులు, సోదరులు, మేనమామలు, బంధువులు, మిత్రులు వీరిని నేను ఎలా చంపగలను అని అనుకుంటున్నావు. వీళ్లను చంపి రాజభోగాలు అనుభవించడం కంటే అడుక్కుతినడం మేలు. ఈ నెత్తురు కూడు నేను తినలేను. అయినా ఈ యుద్ధంలో జయాపజయములుఎవరిని వరిస్తాయో ఎవరికి తెలుసు. వాళ్లే జయంచవచ్చు. మనమే జయించవచ్చు. ఈమాత్రం దానికి ఇంతమందిని చంపాలా! అయినా కృష్ణా! నా మనసు వ్యాకులమై ఉంది. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, తెలియడం లేదు. కాబట్టి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి, నాకు కర్తవ్యమును ఉపదేశించు." అని ప్రార్థించాడు.

అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అన్నాడు. "అర్జునా! ఎవరి కోసరం శోకించడం తగదో వారి గురించి శోకిస్తున్నావు. పైగా బాగా తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. పండితులు అయిన వారు చచ్చిన వారి గురించి కానీ, చావబోయే వారి గురించి గానీ చింతించరు. నువ్వు నేను వీరందరూ ఇది వరకూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. ముందు కూడా ఉంటారు. మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరములలో బాల్య, యౌవన, వృద్ధాప్యములు ఎంత సహజమో మరణమూ అంతే సహజం. శరీరం మరణిస్తుంది కానీ అత్మకాదు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరము ప్రాపంచిక విషయములతో సంయోగం పెట్టుకొనడం వలన సుఖదుఃఖములు కలుగుతున్నాయి. జ్ఞాని అయిన వాడు సుఖదుఃఖములను సమానంగా చూస్తాడు. వాడేమోక్షమును పొందుతాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P137

No comments:

Post a Comment