Wednesday, 10 September 2025

 3️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*42. యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్య విపశ్చిత:|*
 *వేదవాదరతా: పార్థ నాన్యదస్తీతి వాదిన:ll*

*43. కామాత్మాన: స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్l* 
 *క్రియావిశేష బహులాం భోగైశ్వర్యగతిం ప్రతిll*

*44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా2పమృతచేతసామ్l*
 *వ్యవసాయాత్మికా బుద్ధిస్సమాధౌ న విధీయతేll*

ఓ అర్జునా! వివేకము లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే పాకులాడుతుంటారు. అటువంటి వారు వేదములలో చెప్పబడిన విషయములను వాటి పైపై అర్ధములతో తీసుకుంటారు. ఎందుకంటే అవి కర్మలను, వాటి వలన వచ్చే ఫలముల గురించి చెబుతాయి. వేదములలో చెప్పబడిన విషయముల యొక్క అంతరార్థముల జోలికి పోరు. అటువంటి వారు యజ్ఞములు, యాగములు చేస్తే స్వర్గసుఖాలు లభిస్తాయని, స్వర్గసుఖములకు మించిన సుఖము లేదనీ అనుకుంటూ ఉంటారు. అవే కాకుండా, ప్రాపంచిక సుఖములను, కోరికలను పొందడానికి అవసరమైన వ్రతాలు మొదలగు సకామ కర్మలను ఆచరిస్తారు. పండితులు కూడా ఈ సకామ కర్మలు వేదములలో చెప్పబడ్డాయి అని ప్రచారం చేస్తారు. తియ్యగా ప్రవచనాలు చేస్తారు. ఈ తియ్యటి కబుర్లు నమ్మిన మానవులు ఎల్లప్పుడు స్వర్గసుఖముల మీద, ఈ లోకంలో లభించే భోగముల మీదా, సంపదల మీద ఆసక్తితో ఉంటారు. వారి బుద్ధులు పరమాత్మయందు నిశ్చయంగా లగ్నం కావు. వారి బుద్ధికూడా స్థిరంగా ఉండదు.

ఈ శ్లోకములలో పుష్పితాం వాచం అంటే అందమైన పూల వంటి మాటలు. ఈ పూలు ఫలములుగా రూపొందవు. అలాగే ఈ మాటలు కూడా ఫలప్రదములు కావు. ఇటువంటి అందమైన తీయటి మాటలను, వేదములను సరిగా, లోతుగా అర్ధం చేసుకోని వారు పలుకుతుంటారు. పైపై అర్థములను మాత్రమే చెబుతుంటారు. ఇటువంటి మాటలను అవిపశ్చిత: అంటే అజ్ఞానులు, తెలివి లేని వారు నమ్ముతుంటారు. ఎందుకంటే వారికి కోరికలు ఎక్కువ. ఆ కోరికలు తీరడానికే కర్మలు చేస్తుంటారు. స్వర్గంలో లభించే సుఖముల కోసం వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేస్తుంటారు. అటువంటి వారు ఎంతటి పండితుడైనా, వేదములు అధ్యయనం చేసిన వాడైనా, ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాడు అవివేకి కిందనే పరిగణింపబడతాడు. అటువంటి వారి గురించి ఈ శ్లోకాలు చెప్పాడు పరమాత్మ

వేదవాదరతా: అంటే వేదములలో చెప్పబడిన విషయముల గురించి కొంతమంది వాదోపవాదములు చేస్తుంటారు. ఈ యాగం చేస్తే స్వర్గంలో ఈ ఫలం కలుగుతుంది అని ప్రచారం చేస్తుంటారు. వేదములలో యజ్ఞయాగములు గురించే కాదు. నిరాకారుడు, అవ్యయుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మను తెలుసుకోడానికి ఎన్నోమార్గాలు ఉన్నాయి. ఈ వేద పండితులు వాటి గురించి చెప్పరు. కేవలం సుఖాలు ఇచ్చే వాటి గురించే చెబుతుంటారు.

వేదములలో మూడు విభాగాలు ఉన్నాయి. 1. కర్మకాండ 2, ఉపాసనా కాండ 3. జ్ఞాన కాండ. ఈ వేదముల గురించి వాదించే వాళ్లు మొదటిది అయిన కర్మకాండల దగ్గరే ఆగిపోతారు. ఇటువంటి వారిని కామాత్మాన: అంటే కోరికలే పరమావధిగా కలవారు అని అనవచ్చు. వీరికి తన భార్య పిల్లలు, బంధువులు, తన ధనము, ఆస్తి, ఇల్లు తన సుఖం, తనవారి సుఖం ఇవే వారికి కావాల్సింది. వారి మనసులలో ఎల్లప్పుడూ వీటి గురించే ఆలోచిస్తారు కానీ, భగవంతుని గురించి శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించరు.

స్వర్గపరా: అంటే వీరంతా తాము మరణించిన తరువాత స్వర్గానికి పోతామని అనుకుంటారు. ఎల్లప్పుడూ స్వర్గసుఖముల గురించి ఆలోచిస్తారు. కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే స్వర్గమునకు ఎటువంటి విలువలేదు. పరమాత్మను చేరుకోవడమే మానవుల అంతిమ లక్ష్యము. అవివేకుల దృష్టిలో స్వర్గసుఖములే వారికి మోక్షముతో సమానము కానీ జ్ఞానుల దృష్టిలో పరమాత్మలో ఐక్యం కావడమే అంతిమ లక్ష్యం. కేవలం తాత్కాలిక సుఖాలను ఇచ్చే ఈ లోక సంపదలు, స్వర్గసుఖాలు శాశ్వతం కావు అని తెలుసుకోవాలి. అదే జ్ఞానము.

తరువాత జన్మ కర్మ ఫలప్రదామ్ అని అన్నారు. అంటే కోరికలతో కూడిన కర్మలు మోక్షమును ఇవ్వలేవు పైగా బంధనములను కలుగజేస్తాయి. జనన మరణ చక్రంలో పడేస్తాయి. కాబట్టి కోరికలతో చేసే కర్మల కన్నా నిష్కామంగా చేసే కర్మలే ముఖ్యము.

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి అంటే స్వర్గంలో లభించే భోగముల గురించి, ఈ లోకంలో లభించే ఐశ్వర్యముల గురించి ఎన్నో కర్మలు చేస్తుంటారు. కర్మకాండలు చేయడంలో తమ జీవితం అంతా వృధా చేసుకుంటారు. కాని వారికి దక్కేది తాత్కాలికసుఖమే కాని శాశ్వత సుఖం కాదు. తయా2పహృతచేతసామ్ అంటే వేద పండితులు, తాము జ్ఞానులము అనుకొనే వాళ్లు చెప్పే ఈ తియ్యటి మాటలకు మానవుల మనసులు ఆకర్షింపబడుతున్నాయి. అటువైపు లాగబడుతున్నాయి. ఆ మాటలు విని సామాన్యజనులు మోసపోతున్నారు. కర్మకాండలవైపు మళ్లుతున్నారు. శాశ్వత ఆనందం కోసం ప్రయత్నించడం లేదు. అటువంటి మాటలను వినవద్దని కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P93

No comments:

Post a Comment