Wednesday, 23 April 2025

 *ఆలోచనలకు అక్షరరూపం* 

*నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా...* 

*ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞాన ప్రసారం జరగడానికి పుస్తకాలు అతి ముఖ్యమైన సాధనాలు, సిసిరో అనే మహా పండితుడి అభిప్రాయంలో పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది .దీనిని బట్టి పుస్తకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని పుస్తకాలు చదవటం ద్వారా కొంతమంది జీవితాలలో ఎన్నో మార్పులు సంభవించి ఉన్నత స్థానానికి చేరినవారున్నారు. వివిధ వ్యక్తుల ఆలోచనలను, భావాలను తెలుసుకొనుటకు పుస్తకాలు మనకు ఎంతగానో తోడ్పడతాయి. వివేకమును విజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు పుస్తకాలు ఉపయోగపడతాయి.*

*ఎక్కువ సంఖ్యలో చదువుకున్నవారు వున్న దేశాలు అభివృద్ధిపథంలో ముందున్నాయి. చాలామంది పుస్తకాలను చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకొని జీవితంలో గౌరవప్రదంగా బతుకగలుగుతున్నారు. మనకు ఎదురవుతున్న అనేక సమస్యలు గతంలో అనేకమందికి కలిగిన అనుభవాలే. అలాంటి అనుభవాలతో అనేక పుస్తకాలు వచ్చాయి. అవి చదివితే ఎందరో జీవిత అనుభవాలను మనం కొన్ని గంటలోనే తెలుసుకొని మన జీవితాలను చక్కదిద్దుకోవచ్చు. స్నేహితుల సాంగత్యంవలన మంచి చెడులను గ్రహించి ఏ విధంగా ఆనందంగా ఉండగలుగుతామో మంచి పుస్తకాల సహవాసంవలన కూడా అంతే సంతోషంగా ఉండగలుగుతాము. అందుకే పుస్తకాలు మనకు మంచి నేస్తాలని చెప్పవచ్చు. ఒక మంచి పుస్తకం స్నేహితులలోకెల్లా ఉత్తమమైనది. అలాంటి పుస్తక నిలయాలైన గ్రంథాలయాలను అభినవ దేవాలయాలుగా పెద్దలు అభివర్ణించారు. అందుకని విద్యార్థులు మంచి పుస్తకాలు చదవడానికి గ్రంథాలయ మునకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు తమ దగ్గర వున్న పొదుపు డబ్బుతో చిన్నప్పటినుండే మంచి పుస్తకాలు కొనుక్కొని చదివే అలవాటును పెద్దలు ప్రోత్సహించాలి.*

*శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకు పుస్తక అధ్యయనం అలాంటిది. పుస్తక పఠనంతో మేధస్సు సక్రమంగా పనిచేస్తుంది. అనవసరమైన ఆలోచనలవైపు దృష్టి మరలకుండా, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. పుస్తకాన్ని ఆస్వాదిస్తూ చదివితే అది మన మనసుకు ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. మంచి పుస్తకం మనం బాధలో ఉన్నపుడు అమ్మలా లాలిస్తుంది. కష్టాల్లో వున్నపుడు నాన్నలా ఆదరించి ధైర్యం చెపుతుంది. అవసరమైనపుడు గురువులా హితబోధ చేస్తుంది. ఆపదలో వున్నపుడు స్నేహితునిలా అక్కున చేర్చుకొని ఓదారుస్తుంది.*

*ప్రాచీన కాలంనుండి కూడా మన దేశంలో పుస్తకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా భారతీయులే పుస్తక పఠనానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని సర్వేలు చెపుతున్నాయి. ఒక సర్వే ప్రకారం వారానికి భారతీయులు సుమారు 11 గంటల సమయాన్ని పుస్తక పఠనానికి వెచ్చిస్తున్నారు. వేదాలు, పురాణే తిహాసాలు, ఆధ్యాత్మికం, సాహిత్యం, శాస్త్రం, ఆరోగ్యం, రాజకీయం, చరిత్ర మొదలగు అంశాలతో పాటు కథలు, కవిత్వం, నాటకం, వ్యాసం, నవల, పద్యం, గద్యం మొదలగు భిన్న విషయాలతో పుస్తకాలు మనకు విజ్ఞాన భాండాగారంగా వెలుగొందుతున్నాయి. "భారత రాజ్యాంగ పిత అయిన అంబేడ్కర్" తన సమయాన్ని ఎక్కువగా పుస్తక పఠనానికే కేటాయించేవారు. తన సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాల కొనుగోలుకే ఖర్చుచేసే వారు. ప్రపంచంలోని చాలా మంది మేధావులు కూడా పుస్తక పఠనమే అభిరుచిగా కలిగివున్నారు.*

*ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు. కానీ నేటి కాలంవారికి సెల్ ఫోన్ హస్తభూషణంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానంవలన పుస్తకం కూడా తన రూపాన్ని మార్చు కొంటున్నది. ఇపుడు ఏ పుస్తకం కావాలన్నా ఇ-బుక్స్ రూపంలో ఇంటర్నెట్లో లభ్యం అవుతున్నాయి. కాక పోతే ఇందులో చదవడం కొంతమేరకు ఇబ్బందికరంగా ఉంటుంది. సినిమా, టెలివిజన్, మొబైల్, ఇంటర్నెట్ మొదలైన వాటివలన విద్యార్థులలో, యువతలో పుస్తక పఠనం రాను రాను తగ్గిపోతుంది. యువతరాన్ని చదువు వైపు ఆకర్షించే ఉద్దేశ్యంతో యునెస్కో ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. 1995 సంవత్సరంనుండి ప్రపంచ పుస్తక దినోత్సవంను జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచ పుస్తక రాజధానిగా కూడా ఒక నగరాన్ని యునెస్కో ప్రకటిస్తుంది. 2018 సంవత్సరానికిగాను ఏథెన్స్ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. పుస్తకాలకు వున్న ప్రాధాన్యత దృష్ట్యా "కందుకూరి వీరేశలింగం పంతులుగారు చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో" ఆ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుందని అన్నారు. ఆయన చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యాలే...*

*┈━❀꧁గురుభ్యోనమః꧂❀━┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🌷🦚 🙏🕉️🙏 🦚🌷🦚

No comments:

Post a Comment