Tuesday, 22 April 2025

 రావణ కాష్టం రగులుతోందీ అంటారు.

అసలు ఎందుకంటారు?
ఆ కాష్టం ఎందుకు ఇంకా రగులుతూ ఉంది?

రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్లినా మహా పతివ్రత అయిన ఆయన సతీమణి మండోదరి పూజామందిరంలో దీక్షకు కూర్చునేదట. రావణుడి శక్తికి, ఆమె అకుంఠిత దీక్ష తోడై, అన్నీ విజయాలే సిద్ధించేవట.

రామ, రావణ యుద్ధ సమయంలోనూ, ఆమె దీక్షలో కూర్చుందట. ఆమె దీక్షను భగ్నం చేయకుంటే రావణవధ జరగదని తెలిసిన దేవతలు, మండోదరి దీక్ష భగ్నం చేసే బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారట. మారుతి ప్రయత్నంతో మండోదరి దీక్షకు భగ్నమైందట. దాంతో, రాముడు రావణుడిని మట్టుపెట్టగలిగాడట. రావణుడి కాయాన్ని చితిపై చేర్చి తగులబెట్టిన తర్వాత, సతీసహగమనం చేయబోతూ తనను వంచించిన దేవతలను మండోదరి శపించబోయిందట. మహాసాధ్వి శాపానికి భయపడ్డ దేవతలు ఆమెను శాంతింప చేసేందుకు, ఆమెకు శాశ్వత సుమంగళిత్వాన్ని వరంగా ఇచ్చారట.

భర్త చనిపోయిన తాను శాశ్వత సుమంగళిని ఎలా కాగలను అన్న ప్రశ్నకు, చితి ఆరిపోయి అస్తికలు, భస్మాన్ని పుణ్యతీర్థాల్లో నిమజ్జనం చేసి, పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్లు కాదు కాబట్టి, రావణాసురుడి చితి శాశ్వతంగా ఆరిపోకుండా, రగులుతూ ఉండేటట్లు దేవతలు ఆమెకు వరమిచ్చారు. తద్వారా, ఆమె సుమంగళిత్వానికి ఏలోటూ రాదని దేవతలు ఆమెను శాంతింప చేశారు. అప్పటినుంచీ, 'రావణకాష్ఠం రగులుతూనే ఉంటుం'దన్న ప్రయోగం వాడుకలోకి వచ్చింది ! 'సమస్య రగులుతూనే ఉంది' అన్న అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నాం.

No comments:

Post a Comment