3️⃣1️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*రెండవ అధ్యాయము*
*సాంఖ్యయోగము.*
*39. ఏషా తే2భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణుl*
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి॥
అర్జునా! ఈ సమత్వధావనను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగము ఆధారంగా అంటే జ్ఞానము ఆధారంగా చెప్పాను. యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఒక యోగంగా ఆచరిస్తే అదే కర్మయోగము అవుతుంది. ఆ కర్మయోగము ఆధారంగా ఈ సమత్వభావనను ఎలా ఆచరించవచ్చో చెబుతాను విను. ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మబంధనములను దూరంగా నెట్టివేయగలవు. దాని వలన నీకు జ్ఞానం కలుగుతుంది. అని చెప్పాడు కృష్ణుడు.
(ఇక్కడ సాంఖ్యము అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానమును గురించి చెప్పబడే తత్త్వము, జ్ఞానయోగము అని అర్థం చేసుకోవాలి.)
అర్జునా! ఇప్పటి దాకా నీకు జ్ఞానయోగము గురించి, ఆత్మ జ్ఞానము గురించి చెప్పాను. అంటే సాంఖ్యము గురించి చెప్పాను. ఇక్కడి నుండి కర్మయోగము గురించి క్లుప్తంగా చెబుతాను అని అన్నాడు. ఇక్కడ మీకు ఒకసందేహము రావచ్చు. అన్నీ జ్ఞానముతోనే సంక్రమిస్తాయి; జ్ఞానమే ముఖ్యము; జ్ఞానముతోనే ఆత్మతత్వము బోధపడుతుంది అని తెలుసుకున్నాము కదా! ఇప్పుడు ఈ కర్మయోగం ఎందుకు అని సందేహం వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరికి పరిమిత జ్ఞానము ఉంటుంది. మరి కొందరికి విశేష జ్ఞానము ఉంటుంది. కొంత మంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తుంటారు. మరి కొంత మంది అపరిమితమైన ఆసక్తితో చేస్తుంటారు. మరి కొంత మంది నిష్కామంగా, కర్మలను ఒక యోగంగా ఆచరిస్తారు. ఎవరైనా సరే ముందు కర్మయోగము అవలంబించిన తరువాత జ్ఞానయోగానికి వెళ్లాలి. పరిమిత జ్ఞానము కలవారు మొదట కర్మయోగము అవలంబించి కొంత జ్ఞానముసంపాదించి తరువాత మెట్టు ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి కర్మయోగము మొదటి మెట్టు అయితే జ్ఞానయోగము రెండవ మెట్టు అని అనుకోవచ్చు.
కలియుగంలో జ్ఞాన సముపార్జన కష్టం, కానీ మోక్షము జ్ఞానముతోనే కలుగుతుంది. జ్ఞానం కలగాలంటే మొదట కర్మయోగం అభ్యసించి తరువాత జ్ఞానయోగము అనే మెట్టు ఎక్కాలి. కాని మనకు ఒక అపోహ ఉంది. కలియుగంలో కేవలం రామనామ స్మరణ కానీ పరమాత్మ నామ స్మరణ కానీ చేస్తే మోక్షం వస్తుంది అని. మనస్సును శుద్ధి పరచుకోడానికీ, గతజన్మ పాపఫలముల నుండి విముక్తి పొందడానికీ, కొత్తగా కర్మలు చేసి ఆ ఫలములు మూటకట్టుకోకుండా ఉండటానికి పరమాత్మ నామస్మరణ ఉపయోగపడుతుంది కానీ కేవలం నామ స్మరణతో మోక్షం రావడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
అర్జునా! నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా. ఆ సమత్వం జ్ఞాన పరం గానే కాక కర్మ వరంగా కూడా చేయవచ్చు అది ఎలాగో నీకు వివరిస్తాను. ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంటబట్టించుకొని ఈ కర్మబంధనముల నుండి విముక్తుడివి కా! అంటూ తరువాతి శ్లోకంలో ఇప్పుడు చెప్పిన దానిని విపులీకరించి చెప్పాడు కృష్ణుడు.
*40. నేహాభిక్రమనాశో2స్తి ప్రత్యవాయో న విద్యతేl*
*స్వల్పమష్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ll*
ఏ కర్మనైనా నిష్కామంగా, ఒక యోగంగా చేస్తే, దానికి ఎప్పటికీ అపజయము ఉండదు. విపరీత ఫలితములు ఉండవు. అన్నీ మంచి ఫలితములే కలుగుతాయి. పైగా ఈ నిష్కామ కర్మ యోగమును పూర్తిగా ఆచరించక పోయినా పర్వాలేదు. ఎంత చేస్తే అంతవరకే ఫలితం ఇస్తుంది. ఏ కొంచెం సాధన చేసినా అది మనలను మృత్యు భయం నుండి కాపాడుతుంది.
ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి. అప్పుడే చెప్పబోయే విషయం చక్కగా అర్థం అవుతుంది. దానినే భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు. కర్మయోగము అంటే మానవ జీవన విధానము. బయట మనం ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తాము. కాని లోపల అంతా కల్మషంగా ఉంటుంది. కాని లోపల కూడా అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన, కర్మయోగములు. చాలా మందికి ఎంతో ఐశ్వర్యం సంపదలు చుట్టు జనం ఉంటారు. కాని ఒంటరి తనం ఫీల్ అవుతుంటాడు. ఏదో తెలియని వెలితి. ఏదో కావాలని తపన. మనశ్శాంతి కొరకు పరితపిస్తుంటారు. ఆ మనశ్శాంతి ఇదిగో ఈ జ్ఞాన కర్మయోగములు ఆచరిస్తే దొరుకుతుంది అని భగవానుడు చెబుతున్నాడు. ప్రస్తుతం అర్జునుడు అదే అశాంతితో బాధపడుతున్నాడు. ఏదో జరిగిపోతుంది అని ఆవేదన చెందుతున్నాడు. దానిని పోగొట్టడమే కృష్ణుడి కర్తవ్యము. మనశ్శాంతి మనయొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుందేకానీ, మనకు ఉన్న సిరి సంపదల వల్ల కాదు అని కర్మయోగం బోధిస్తుంది. సుఖం ఎక్కడో లేదు. మనకు ఉన్న ధనము, ఆస్తి, పదవి, సంపాదన వీటిలో లేదు. ఇవి ఎన్ని ఉన్నా నిరంతరం దుఃఖంతో బాధపడేవాళ్లు ఉన్నారు. సుఖం మనలో ఉంది. మన ఫీలింగ్ లో ఉంది. మన మనసులో ఉంది. కాని మనం దానిని నమ్మము. మనకు అంగబలం అర్ధ బలం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అనే అపోహలో ఉంటాము. ధనం కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ ఒక మేరకు ఉంటే పర్వాలేదు. అమితంగా ఉంటే అదే అన్ని దు:ఖములకు కారణం అవుతుంది. కాబట్టి ధనము, ఆస్తి, బంగారము, అంగ బలము శారీరక సుఖాన్ని ఇస్తాయోమో కానీ, మానసిక సుఖాన్ని మానసిక ఆనందాన్ని ఇవ్వవు.
ఈ కర్మయోగం అనుష్ఠానం చేస్తే ఎవరికీ అపజయమే ఉండదు. చేసిన కర్మలకు విపరీత ఫలితములు కూడా రావు. సక్రమమైన ఫలితములే వస్తాయి. ఎలాగంటే మనం కర్మలను మెటీరియలిస్టిక్ గా చేస్తాము. కర్మను కర్మగానే చేస్తాము. కాని కర్మను ఒక యోగంగాచేస్తే అంటే పరిశుద్ధమైన చిత్తముతో చేస్తే దాని వలన అపజయం కాని, విపరీత పరిణామాలు కానీ ఉండవు. ఏవేవో కోరికలు కోరుకుంటూ కర్మలు చేస్తే, ఆ కోరికలు తీరక పోతే విపరీత పరిణామాలు సంభవిస్తాయి. కానీ నా ధర్మం నేను చేస్తున్నాను. ఏం ఫలితం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను, పరమాత్మ ప్రసాదం అనుకుంటాను అని కర్మను ఒక యోగంగా చేస్తే, విపరీత పరిణామలు అంటూ ఏమీ ఉండదు. పైగా ప్రతి అపజయం నుండి తిరిగి జయం పొందడానికి కావలసిన పాఠాలు నేర్చుకుంటాడు.
ఈ కర్మయోగము పూర్తిగా ఆచరించవలసిన అవసరం లేదు. కొంచెం ఆచరించినా చాలు ఆ జనన మరణ భయం నుండి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే, ప్రాపంచికమైన కర్మలు పూర్తిగా చేస్తేనే కానీ నీకు ఫలితం దక్కదు. కానీ ఈ కర్మయోగము చిత్త శుద్ధితో నిష్కామంగా చేస్తే, కొద్దిగా ఆచరించినా పూర్తి ఫలితం ఇస్తుంది. ఒక కోటీశ్వరుడు ఏదో పుణ్యం వస్తుందని కోటి రూపాయలు దానం చేస్తే వచ్చే ఫలం, ఒక సామాన్యుడు ఆకలితో ఉన్న వాడికి కడుపు నిండా అన్నం పెడితే వచ్చే ఫలితం కన్నా తక్కువే. క్లుప్తంగా చెప్పాలంటే కర్మను కోరికతో చేస్తే బంధనములు కలిగిస్తుంది. అశాంతిని కలిగిస్తుంది. కర్మను కోరికలేకుండా చేస్తే శాంతిని కలిగిస్తుంది. కర్మ బంధనముల నుండి మోక్షమును కలిగిస్తుంది.
(సశేషం)
*🌹యోగక్షేమం వహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P89
No comments:
Post a Comment