Saturday, 17 May 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
             *కరుణాపయోనిధి*

*ఈ ప్రపంచం అంతా అపార కారుణ్యంతోనే బతుకుతోంది. కారుణ్యంలోనే వర్ధిల్లుతోంది. కారుణ్యంతోనే పరమావధిని చేరుకొంటోంది. ఇది సత్యం. కారుణ్యమే లేకుంటే ఈ జగత్తు సృష్టికి, స్థితికి, లయానికి అర్థమే ఉండదు. కారుణ్యం దైవగుణం. కరుణామయులై కోరిన వరాలు అందిస్తూ, కాపాడతారనే దేవతలను మానవులు కొలుస్తున్నారు. ఆపదలు వచ్చినప్పుడు వారే ఆదుకుంటారనే నమ్మకం మనిషిని బతికిస్తోంది. త్రేతాయుగంలో భూమిపై అవతరించి, ధర్మాన్ని కాపాడిన శ్రీరాముడు మానవాళికి ఆదర్శపురుషుడైనాడు. భద్రగిరిగా, భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన దివ్యధామాన్ని నిర్మించినవాడు ప్రముఖ రామభక్తుడు కంచెర్ల గోపన్న. ఇతడికే రామదాసు అనే పేరుకూడా ఉంది.* 

*రాముడిపై అకుంఠిత భక్తితాత్పర్యంతో కంచెర్ల గోపన్న రాసిన స్తుతి ‘దాశరథి శతకం’. ఈ శతకానికి అతడు ‘దాశరథీ!కరుణాపయోనిధీ!’ అనే మకుటాన్ని నిర్దేశించాడు. ఈ శతకంలోని పద్యాలన్నీ రత్నాలే. వాటి కాంతి వందల ఏళ్లయినా ఏమాత్రం తరిగి పోకుండా, వెలుగులు చిమ్ముతూ మానవాళికి నీతిని, రీతిని ప్రబోధి స్తున్నాయి. రామన్నను గోపన్న అనేక విశేషణాలతో కీర్తించాడు. అతడి భావనలో రాముడు రంగద రాతిభంగుడు (ప్రకృష్ట శత్రువులను సైతం ఓడించేవాడు), ఖగరాజ తురం గుడు (పక్షిరాజైన గరు త్మంతుని వాహనంగా చేసుకొన్న విష్ణువు), విపత్ప రంపరోత్తుంగ తమః పతంగుడు (ఎన్ని ఆపదల చీకట్లనైనా చీల్చివేయగల సూర్యుడు), పరితోషిత రంగుడు (రంగనాథుణ్ని సంతోషంలో ఓలలాడించినవాడు), దయాంతరంగుడు (దయగల మనసు గలవాడు), సత్సంగుడు (సజ్జనులతో కూడినవాడు), ధరాత్మజాహృదయ సారసభృంగుడు (భూసుత అయిన సీతాదేవి హృదయపద్మంలో తిరిగే తుమ్మెద), శుభాంగుడు (మంగళప్రదమైన శరీరం కలవాడు). ఇలాంటి దశరథాత్మజుని అనేక విధాలుగా కీర్తించాడు గోపన్న.*

*ప్రాణుల ఆర్తిని తన ఆర్తిగా భావించి గోపన్న రాముడికి ఇలా విన్నవించాడు-‘రామా! శరీరంలోని అయిదు ఇంద్రియాలు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటినుంచి రక్షించు. ఏనుగు శరీరచాపల్యంతో శరీరాన్ని కృశింపజేసుకుంటోంది. చేప ఎరను తినడానికి యత్నించి, జిహ్వేంద్రియం వల్ల ఇతరులకు దొరికిపోతున్నది. పాములు మధుర సంగీతానికి మోహపడి శ్రవణేంద్రియం కారణంగా చిక్కిపోతున్నాయి. జింకలు కన్నులతో ఆకర్షణకు లోనై, ప్రాణాలు అర్పిస్తున్నాయి. పూలవాసనలతో తుమ్మెదలు నశిస్తున్నాయి. ఇలా పంచేంద్రియాలూ ప్రాణులను వశంచేసుకొని బలిచేస్తున్నాయి. వీటినుంచి ప్రాణులను కాపాడు.’ రామా! తల్లిదండ్రులు, భార్య, సంతానం, చుట్టాలు అందరూ నిమిత్తమాత్రులే. ప్రాణి పుట్టే సమయంలో ఒంటరిగానే భూమిపైకి వస్తుంది. చివరికి మరణించే సమయంలో కూడా ఒంటరిగానే వెళ్లిపోతుంది. లోకంలో కనబడేదంతా మాయే. ఈ కపటపు మాయనుంచి ప్రాణులను కాపాడు!’ ఇలా ఎన్నో నీతులకు ఆలవాలం దాశరథి శతకం. మనిషి తానెందుకు పుట్టాడో వివేచించుకోవాలి. బతికినంతకాలం ఏయే పనులు చేయాలో నిర్ణయించుకోవాలి. జీవన సంధ్యాకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళికను సమకూర్చుకోవాలి. భగవంతుడు ప్రసాదించిన ఆయుష్యాన్ని సంపూర్ణఫలంగా అనుభవించాలే కాని, వ్యర్థం చేసుకోకూడదు. ఇదే ఈ శతకంలో ప్రతిబింబించే పరమార్థం!*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🪸🌴 🪸🌴🪸 🌴🪸🌴

No comments:

Post a Comment