Saturday, 17 May 2025

 ది గ్రేట్‌ డిక్టేటర్‌లో చార్లీ చాప్లిన్‌ భావోద్వేగ ప్రసంగం

‘‘క్షమించండి, చక్రవర్తి కావాలనే కోరిక లేదు. అది నా పని కాదు. పాలించాలని, జయించాలని కోరుకోను. ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్నదే నా అభిమతం. సాయానికి యూదులా, క్రైస్తవులా, నల్లజాతీయులు, తెల్లవారా అనే భేదం లేదు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి. ఇది మానవ ధర్మం. కలిసి మెలిసి సుఖసంతోషాలతో జీవించాలి. ఒకరినొకరం బాధపెట్టు కోవడం, ద్వేషించుకోవడం, తిరస్కరించుకోవడం వంటివి నివారించాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ చోటు ఉంది. భూమి చాలా గొప్పది. ప్రతి ఒక్కరిని పోషించగలదు. స్వేచ్ఛగా జీవించగలగడం ఓ అందమైన అనుభూతి. కానీ మనం ఆ మార్గాన్ని పోగొట్టుకున్నాం. అత్యాశతో మనుషుల ఆత్మలు కలుషితమయ్యాయి. ప్రపంచాన్ని ద్వేషం ఆవహించింది. మానవాళికి కాఠిన్యాన్ని నేర్పింది. రక్తపాతం, హింసకు అలవాటు చేసింది. మనం గతి(స్పీడ్‌)ని కనుగొన్నాం కానీ మనల్ని మనం పరిమితం చేసుకున్నాం. యంత్రాల ద్వారా లభిస్తున్నది చాలక అత్యాశ కు పోతున్నాం. విజ్ఞానం మనల్ని నిరాశావాదులను చేసింది. తెలివి మనలో దయను మరిపించింది. అతిగా ఆలోచిస్తూ మితిగా అనుభవించే స్థితిలో మనం ఉన్నాం. యంత్రాలు కాదు మానవాళి విలువైనది. తెలివితేటల కంటే దయ, సౌమ్యత మనకు అవసరం. ఈ లక్షణాలు లేకపోతే మానవ జీవితం హింసాత్మకంగా మారి... అంతా నశించిపోతుంది.
విమానం, రేడియో మనల్ని దగ్గరకు తెచ్చాయి. ఈ ఆవిష్కరణల స్వభావం మానవత్వాన్ని... సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతాభావాన్ని చాటుతుంది. ఈ క్షణం నా మాటలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి చేరుతున్నాయి. నిస్సహాయులు, పసివారు, అమాయకులను నిర్బంధించి వేధించే వ్యవస్థల బాధితులు వినగలుగుతున్నారు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే నిరాశపడవద్దు. మీరు అనుభవిస్తున్న కష్టాలు మానవుల అత్యాస పర్యవసానం. మానవ పురోగతికి విఘతం కలిగిస్తూ ద్వేషాన్ని పంచేదే అత్యాస. పరిస్థితులు మారుతాయి. ద్వేషం నశిస్తుంది. నియంతలు చనిపోతారు. ప్రజల నుంచి లాక్కున్న అధికారం తిరిగి ప్రజలకు చేరుతుంది. మనుషులు కాలగర్భంలో కలిసిపోతారు కానీ స్వేచ్ఛకు అంతరించిపోదు.
సైనికులారా! మీరు మీ జీవితాలను శక్తిమంతుల కోసం పణంగా పెట్టవద్దు. మిమ్మల్ని ద్వేషించేవారికి బానిసలు కావద్దు. మిమ్మల్ని ఎవరో శాశించే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకోవాలి, ఏమి తినాలి, ఎలా జీవించాలన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ జీవితం మీ సొంతం. మీ అనుభవాలు, ఇష్టాయిష్టాలు మీ సొంతం. మీ జీవితాలను శాసిస్తూ, మిమల్ని పశువుల్లా చూస్తూ, మిమ్మల్ని తుపాలకు ఆహారంగా చేసేవారికి తలొగ్గవద్దు. అలాంటి అసహజ, యాంత్రిక మనుషులకు, ఆలోచనలకు దాసోహం కావద్దు.  మీరు యంత్రాలు కాదు! మీరు పశువులు కాదు! మీరు మనుషులు! మీ గుండెల నిండా మనుషుల కోసం ప్రేమ ఉంది! మీలో ద్వేషం లేదు! ప్రేమ తెలియని వారే ద్వేషించగలరు` అది అసహజం! సైనికులారా! బానిసత్వం కోసం కాదు స్వేచ్ఛ కోసం పోరాడండి!
  సెయింట్‌ లూక్‌ గ్రంధంలోని 17వ అధ్యాయంలో ఇలా వుంది: ‘దేవుని రాజ్యం మనుషులలో ఉంది’. ఇది ఒక మనిషి... సమూహానికి పరిమితం కాదు. ప్రతి ఒక్కరిలోనూ దేవుడి వాసముంది. అవును మీలో శక్తి ఉంది. యంత్రాలు తయారు చేయగలిగే శక్తి.... సంతోషాన్ని సృష్టించే శక్తి మీలో ఉంది! ఈ జీవితాన్ని అందంగా, ఆనందంగా, స్వేచ్ఛగా తీర్చిదిద్దుకోగలిగిన శక్తి మీలో ఉంది! ఈ జీవితాన్ని అద్భుత అనుభూతిని మీరు మలుచుకోగలదరు! ప్రజాస్వామ్యం పేరిట మనం మనలోని శక్తిని వాడుదాం. ఏకమవుదాం! సరికొత్త ప్రపంచం కోసం కలిసికట్టుగా పాటుపడదాం! ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం! అందులో యువతకు ఉజ్వల భవిష్యత్తుకు హామీ... వృద్ధాప్యానికి భద్రత ఉంటాయి. ఇటువంటి హామీలు ఇవ్వడం ద్వారానే పాశవికులు అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ వారు అబద్దాలే చెప్పారు! ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేరు. ఏ ఒక్క హామీకి కట్టుబడరు! నియంతులు తమను తాము విముక్తులను చేసుకుంటారు కానీ ప్రజలను బానిసలు చేస్తారు! బానిసత్వ సంకెళ్లు తెంచుకుంటూ నిరంకుశత్వాన్ని జయించే హామిని నెరవేర్చేందుకు మనమంతా ఐక్యంగా పోరాడదాం! స్వేచ్ఛ ప్రపంచం కోసం పోరాడదాం! అత్యాస, ద్వేషం, అసహనం లేని ప్రపంచం సృష్టించుకుందాం! మానవాళి సంతోషానికి దారి తీసే విజ్ఞత, విజ్ఞానంతో కూడిన సంతృప్తికర జీవితాన్ని అందించే ప్రపంచాన్ని నిర్మిద్దాం.  సైనికులారా! ప్రజాస్వామ్యం పేరిట ఏకమవుదాం!’’

No comments:

Post a Comment