Wednesday, 23 April 2025

 🙏🪷జై శ్రీరామ్ 🪷🙏

 "సుగుణం నిన్ను రాజును చేస్తే!
" మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది!

*🍁నీవు మనస్సుకు లొంగిన  క్షణాల్లో  నీవే రాక్షసుడవు.*
     *ఆ మనస్సు నీకు లొంగిన క్షణాల్లో నీవే దేవుడవు.*🍁
 
     🍃🍁 మంచి మాట 🍁🍃
•<>•<>•<>•<>•<>•<>•
      శాంతాన్ని మించిన తపస్సు లేదు,
  సంతోషానికి సమానమైన సుఖంలేదు.
    కోరికలను మించిన అనారోగ్యం లేదు,
         కరుణను మించిన ధనం లేదు.
      మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి 
           కూడా ఆరోగ్యంగా ఉంటాడు..
         మనసు ఆరోగ్యంగా ఉండాలంటే 
         గతాన్ని తక్కువగా ఆలోచించాలి
      భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి
                 అదే మానవ జీవితం.

:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
     🌸🌟🍁మంచి మాట 🍁🌟🌸
:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
          ఉప్పుని కూరలో వేస్తే రుచిని
       ఇచ్చింది కదా అని పాలలో వేస్తే 
             పనికి రాకుండా చేస్తుంది
           పదార్థాన్ని బట్టి అవసరము 
     పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి
      కనుక మనమెంత  గొప్పవారిమైనా 
    మన అవసరం లేని దగ్గర మౌనంగా    
ఉన్నప్పుడే మన విలువ పెరుగుతుంది.   
   🌹✨🌹✨🌹✨🌹✨🌹✨🌹
        🪴🙏 *శుభోదయంతో*🙏🪴
🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈

 *తప్పకుండా చదవాల్సిన గొప్ప నీతి కథ....*
*గొప్ప నీతి కథ..*

అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.

అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

*నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.

*అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను 
చ* చ్చిపోతాను కదా!* కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ. 

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా? 

నీ శరీరానికి *డయాబెటిస్* కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి *బీపీ* సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపు కున్నాను. 

ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే వున్నాయి కదా!ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. 

*నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట*

అడుగు తీసి అడుగు వేయ డానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. 

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? 

*ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?*

*నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం*?

నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా! నా ఇంటికి ఉన్న 9-ద్వారాలకూ సమస్యలే. 

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

*అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు .. డబ్బు జబ్బు*.  నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? 

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? 

*ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు*. 

ఇంకొకడిని అణగతొక్కడానికి  నాతో కుట్రలు చేయించావు. 

ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా, చేసావో గుర్తు తెచ్చుకో. 

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? 
*ఇక నేనుండలేను వెళ్తున్నా!*

 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువ య్యింది. 
దాంతో ఈ రోజు, ఈక్షణాన్ని ఆనందించడం మరచి పోతున్నాడు. 
దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?
 కథ పేరు...

*ఒక్కసారి*ఆలోచించండి* !

*******************
"నమస్కారం సార్!"
తలెత్తి చూసాను. ఎదురుగా ఓ యువజంట.
"సార్! విడాకులుకు అప్ప్లై చేయాలని వచ్చాం. మీరు లాయర్ రావుగారే కదా!" 
నాకేసి చూస్తూ అడిగాడతను. 
చూస్తే చూడముచ్చటగా ఉన్నారనిపించింది.
"యస్! లాయర్ రావును నేనే. బై ది బై ఫ్యామిలీ కౌన్సిలర్ ని కూడా "

అంటూ 
వచ్చిన ఆ ఇద్దరినీ తేరిపారా చూశాను. 
ఇద్దరి వయసూ దాదాపు  ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మధ్య ఉండవచ్చేమో ?
ఆమె  ఎదురుగా కనిపిస్తున్న    గదిలోని గోడలను చూస్తోంది. అతను నాకేసి చూస్తున్నాడు.
నేను ఇద్దరినీ పరిశీలిస్తూ "ముందు కూర్చోండి !"అంటూ నా టేబుల్ కు ఎదురుగా ఉన్న కుర్చీలను చూపించాను.
"తన పక్కన కూర్చోను!" అంటూ అతను కుర్చీని కొంచెం దూరంగా జరిపి కూర్చున్నాడు.
"నాకు మాత్రం ఇష్టమా!" అంటూ ఆమె కూడా కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంది.
ఇద్దరూ కోపంగానే ఉన్నారు.
సమానంగానే తగవు లాడుకుంటున్నారని అర్ధమైంది.
"అబ్బాయ్ !నీ పేరు?" అన్నాను.
"సుధీర్ సార్!" అన్నాడు.
"అమ్మాయి! మరి నీ పేరు ?"
"సరళ !సార్."
"పేర్లు కలిశాయి. చూస్తుంటే వయసు దగ్గరగానే కుదిరినట్లుంది. ఇంక దేనికి విడాకులు ?" ఇద్దరికేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.
"మనసులు కలవలేదు సార్!" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"మీది పెద్దలు కుదిర్చిన వివాహమా ?"
"కాదు ...లవ్ మ్యారేజ్ సార్!" సుధీర్ అన్నాడు.
"ప్రేమికులు దంపతులయ్యారు. కానీ దంపతులయ్యాకా ప్రేమ కొరవడిందా ?"
నా ప్రశ్నతో ఇద్దరూ నాకేసి విచిత్రంగా చూశారు.
"పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి మనసులు కలిస్తే చాలు. ఇక వేరే కారణంతో పని లేదు. కానీ విడిపోవడానికి బలమైన కారణం ఉండాలి. ప్రేమించుకున్నప్పుడు కలిసిన మనసులు పెళ్లయ్యాక ఏమయ్యాయి ? సరే..ఇప్పుడు చెప్పండి. విడాకులు ఎందుకు కావాలంటున్నారు ?"
నేను సూటిగా అడగడంతో వాళ్లిద్దరూ ఒకేసారి...ఒకరి నొకరు వేలెత్తి చూపించు కుంటూ..."తనకు ఇగో, సార్ !"అన్నారు.
నాకు నవ్వొచ్చింది.
"ఎందుకు సార్ నవ్వారు ?" ఒక్కసారిగా ఇద్దరూ  నన్నడిగారు.
"ఏం లేదు. కలిసి ఉండలేమంటున్నారు. కానీ కలసి  సమాధానం ఒకటే చెప్పే సరికి నవ్వకుండా ఉండలేకపోయాను.
లేడీస్ ఫస్ట్ అంటారు. సరళ ముందు చెబుతుంది. సుధీర్ నువ్వు మాత్రం మధ్యలో అడ్డు రాకూడదు !" అంటూ సరళ వైపు  చెప్పమన్నట్టుగా చూశాను.
"ఆఫీసునుండి రాగానే హాల్లో సోఫాలో ఒరుగుతూ తను టి.వి.ముందు దర్జాగా కూర్చుంటాడు. నేను మాత్రం కిచెన్ రూమ్ లోకి వెళ్లి చెమటలు కార్చుకుంటూ వండి పెట్టాలి..
నేను కాఫీ కలిపిస్తే అతను హ్యాపీ గా సిప్ చేస్తాడు. ఖాళీ కప్పు కూడా సింక్ లో పడేయడు.
అటు ఆఫీసులో....ఇటు ఇంట్లో పని తప్పడం లేదు.
సుధీర్ తో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. కనీసం నాతో సమానంగా అతను పని చేయడా ?
ఈ కంజెస్టెడ్ జీవితం నాకు వద్దు. నాకూ చదువుంది. ఉద్యోగం ఉంది. అందం ఉంది. హోదా ఉంది. అన్నీ ఉండి కూడా పాతకాలపు ఇల్లాలుకు మల్లె ఉండాల్సిన ఖర్మ నాకేంటి ? నా పేరెంట్స్ 'నీ వెనుక  మేమున్నాం' అన్నారు. నో వే సార్.. ఐ వాంట్ డైవర్స్"
గుక్క తిప్పుకోకుండా మనసులో మాటలన్నీ ఏకరువు పెట్టింది.
"ఓకే! సరళ..సుధీర్! ఇప్పుడు నువ్వేమంటావ్?" అంటూ సుధీర్ వైపు చూశాను.
"సార్! తను నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని అహంకారం. అందుకే నన్ను ఇంటి చాకిరీ పంచుకో మంటుంది. నేను మగాన్ని ...సింహంలా బతికాను. దర్జాగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తే  తప్పేంటి ? నాకంటే ఎక్కువ సంపాదిస్తోందని పనిలో ఇంటిపనిలో వాటా వేస్తే ఎలా?ఇలా అయితే రేపు కన్సీవ్ అయ్యాకా పదిలో సగం ఐదు నెలలు నన్ను మోయమంటుంది కూడా. ఎవరు చేసేపని వాళ్ళు చెయ్యాలి.
సమ విభజన కోసం సైన్స్ కే విరుద్ధంగా మాట్లాడుతుంది. అన్ని పనులూ చేస్తే ఆడంగి వాడంటారు..ఎప్పుడైనా పొరపాటున కాఫీ కలిపితే ఊరుకుంటారా ?బావుందంటారు. కిచెన్ రూమ్ లో వాటా పెడతారు. నువ్వు కూరలు తరుగు. నేను వంట చేస్తానంటారు. నువ్వు బియ్యం కడుగు. నేను కుక్కర్ పెడతానంటారు.
"మగాడివి, మహారాజులా ఉండు. భార్యకు బానిస కాకు" అని నా పేరెంట్స్ పెళ్లికి ముందే  చెప్పారు.
నాకు సరళకు సరిపడలేదు సార్! ఐ టూ వాంట్ డైవర్స్. సుధీర్ కూడా అంతే గట్టిగా చెప్పాడు.
ఇద్దరూ ఒకరికేసి ఒకరు కోపంగా చూసుకున్నారు.
"బిడ్డను కనడానికి  సర్రోగసి సిస్టం ఉంది తెలుసుకో" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"చూసారా సార్! అంటే తను కనలేనని ముందే షరతుగా చెప్పేస్తోంది. అమ్మ కావడం కన్నా, అందంపై మోజే మిన్న సార్ తనకూ. నాకు వద్దు సార్!"
సుధీర్ అన్నాడు ఆవేశంగా.
"ఏయ్! మిస్టర్! నేను మార్గం చెప్పాను. కానీ ఆ మార్గంలో వెడతానని అనలేదే.
మాటలను సరిగ్గా అర్ధం చేసుకోని మొండివానితో నేను వేగలేను సార్! నాకు అతనితో 
విడాకులు ఇప్పించండి. ప్లీజ్" సరళ బతిమాలే ధోరణిలో నా వైపు చూస్తూ చేతులెత్తింది.
"ఉష్ ...గొడవలు పెట్టుకునే వచ్చారు. మళ్లీ ఇక్కడ కూడా గొడవలా ?..మీరు సైలెంటుగా ఉంటేనే మాట్లాడుతా. నాకు టైం లేదు. మరో కేసు బయట సిద్ధంగా ఉంది. నా మాట వింటారా ? లేక వెళ్లిపోతారా ?" నేను గట్టిగా అడగడంతో ఇద్దరూ ఒక్కసారిగా ఆగారు.
తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది.
ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ నేను అందుకున్నాను.
"చూడండీ! మీరిద్దరూ మాట్లాడారు. 
నేను విన్నాను. ఫ్యామిలీ కౌన్సిలర్ ని కదా. ముందు నా మాట కూడా మీరు వినాలి. 
ఆ పై మీ అభిప్రాయం. సరేనా!" అంటూ ఇద్దరికేసి చూశాను.
వాళ్ళు మళ్లీ ఒక్కటిగా "ఒకే సార్!" అన్నారు.
ఈసారి పైకి నవ్వు కనబడకుండా ...లోపల నవ్వుకున్నాను.
"అమ్మానాన్నా, తోబుట్టువులూ గాడ్స్ గిఫ్ట్...ఎలా ఉన్నా ఒప్పుకుంటాం. జీవితాంతం వారితో బావుంటాం. బాగానే చూస్తాం. కానీ భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి
చిన్న కారణానికే...అంటే  కుక్కర్ పొయ్యిమీద పెట్టలేదని, అడిగిన డిష్ చేయ లేదని, కూల్ డ్రింక్ తేలేదని, నేనంటే ప్రేమే లేదని, ఇలా సిల్లీ పాయింట్స్ నే సీరియస్ గా తీసుకుంటున్నారు. నచ్చలేదని జీవిత భాగస్వామిని వదులు కోవడానికి సిద్ధపడి పోతున్నారు..."
"సార్, అదీ..."సుధీర్ ఏదో చెప్పబోయాడు.
"ప్లీజ్...లెట్ మి టెల్ యూ" అనగానే చెప్పమన్నట్టుగా  మౌనం వహించాడు.
"అటుగాని, ఇటుగానీ, ఒకప్పుడు నచ్చచెప్పి కాపురానికి పంపించే పేరెంట్స్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారు.
అగ్ని కి ఆజ్యం పోస్తున్నట్లుగా 'విడిపోయినా నీకేం పర్వాలేదంటూ' భరోసా ఇస్తున్నారు.
అయినా వస్తువును సృష్టించ డానికి కష్టపడాలి గానీ, నాశనం చేయడం ఎంతసేపు ?నేలకేసి గట్టిగా కొట్టినంతసేపు పట్టదు.
అవునా ? కాదా ?" ఇద్దరినీ అడిగాను.
వాళ్లిద్దరూ బదులు ఇవ్వలేదు. నా మాటలు వింటున్నారని పించింది. ఆలోచనలో పడుతున్నారని అర్థమయ్యింది.
ఇదే సరైన సమయం అని భావించాను.
"ఆమెకు ఒంట్లో బాగో లేకపోతే కూర చేయాలా ? కర్రీ పాయింట్ నించి తెప్పించడానికి వర్రీ ఎందుకు ? అతనికి ఒంట్లో నలతగా ఉన్ననాడు ఈరోజు శనివారం...షికారుకు రా' అని పిలవడం దేనికి ? ఒక శనివారం పోతే, మరో  శనివారం రాదా? ఆరోగ్యమే  మహాభాగ్యం అని గుర్తించాలి కదా!..గొడవలు తవ్వుకుంటే ఇద్దరి మధ్య  పూడ్చలేని గొయ్యి మిగులుతుంది. కానీ సర్దుబాటు మొదలైతే సమాధానం దొరుకుతుంది. సఖ్యత పెరుగుతుంది. పరిష్కారం లభిస్తుంది. ఆవేశం తగ్గించుకుంటే ఆలోచన మొదలవుతుంది." అని ఆగి ఇద్దరికేసి చూసాను. మౌనంగా వింటున్నారు.
"కృష్ణ అని నా  ప్రాణ స్నేహితుడు, పెళ్ళైన కొత్తలో భార్యను బాగా చూసుకునే వాడు. భార్య ఎదురురానిదే బయటకు వెళ్లేవాడు కాదు. అయితే అతని వృత్తిపరమైన బాధ్యత, బాగా సంపాదించాలనే ఆత్రుతతో భార్యకు సమయం కేటాయించలేక పోయాడు. పోనుపోనూ డబ్బును ప్రధాన లక్ష్యం చేశాడు. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. భార్య 'నన్ను భార్యగా చూడండి' అంటూ అభ్యర్ధించింది. కానీ కృష్ణ అందుకు సమయం లేదన్నాడు. మీరు నాకు సరి పడరంటూ, ఆమె కృష్ణనుండి విడాకులు తీసుకుంది.
కోల్పోయకా మనిషిని గుర్తుకు తెచ్చుకున్నట్లుగా, వెళ్ళిపోయాక కృష్ణకు భార్య విలువ తెలిసొచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె రెండో  జీవితం మొదలు పెట్టింది.
'సమయాన్ని సర్దుబాటు చేస్తే ఎంత బాగుండేదో ?' అని కృష్ణ బాధపడ్డాడు. కానీ ఆ బాధకు  ప్రయోజనం లేదు.
ఇతరుల పట్ల ఆకర్షణ, జీవిత భాగస్వామివద్ద నిరాదరణ, కారణాలు మొదట్లో చిన్నవిగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. గతంలోనూ ఇవి ఉన్నాయి.కానీ కుటుంబంలో పెద్దలు సర్ది చెప్పేవారు. విడాకుల వరకూ వెళ్లకుండా తిరిగి కలిపేవారు. ఇప్పుడు వాళ్ళూ వెనకేసు కొస్తున్నారు. గుమ్మానికి వాడిపోయిన మామిడాకులను తీసేసినంత సింపుల్ గా విడాకులను తీసుకోమంటున్నారు. పేరెంట్స్ సర్దిచెబితే.. కౌన్సిలర్ అవసరం దేనికి ?
ప్రేమ, పరస్పర అవగాహన, ఒకరంటే మరొకరికి గౌరవం, సహకార భావన ఈ నాలుగూ దాంపత్యానికి పునాదులు. బీటలు వారితే వారిమధ్య సంబంధం సమాధి అవుతుంది. ఏ కాలంలోనైనా దాంపత్యానికి ప్రధాన సూత్రాలు రెండే రెండు. ఒకటి అర్ధం చేసుకోవడం. రెండు సర్దుకు పోవడం. సంపాదన కంటే సమయం గొప్పది. ఆ సమయాన్ని భార్యాభర్తలు కలసి సర్దుబాటు చేసుకుంటే అది  ర"సమయం" అవుతుంది. లేకపోతే విషమయానికి దారి తీస్తుంది.
విడిపోదాం, విడాకులు తీసుకుందాం అని వచ్చారు.అప్పుడు  ఆవేశం తప్ప ఆలోచన ఉండదు.
ఒక్కరోజు "కలిసుందాం" అని అనుకోండి. సర్దుబాటు మొదలవుతుంది. ఆలోచన ఆచరణ అవుతుంది.
అడవిలో పుట్టిన కవ్వం మనింటికి వస్తుంది. పాలతో బంధం ఏర్పర్చుకుంటుంది. సున్నితమైన వెన్నను ఇస్తుంది.ప్రాణం లేని వస్తువులే  ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రేమనే ప్రాణంగా చేసుకుని ఒక్కటయ్యారు.
ఒక్కసారి ఆలోచించండి ! 
విడిపోవడానికి కాదు, కలిసుండటానికి.
అప్పుడు రండి. మీరు కాదూ,  కూడదంటే  విడాకులు  ఇప్పించడం పెద్ద పని కాదు. నిర్ణయం మీదే. ఇప్పుడు దయజేయండి" అన్నాను.
నా మాట విన్నట్టుగా వాళ్ళు లేచారు.
"వస్తాం సార్!" అంటూ లేచారు.
"ఆవేశంతోనా ? 
ఆలోచనతోనా ? " అన్నాను నవ్వుతూ.
"ఆచరణతో సర్!" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
నాకు మళ్ళీ నవ్వొచ్చింది.
ఈసారి "వెళ్లండి, కానీ రావద్దు" పైకి నవ్వుతూ అనేసాను.

ముందుకు వెడుతున్న సుధీర్ ఒక్కసారిగా ఆగి నా వైపు చూశాడు. 'ఎందుకు ?' అన్నట్లుగా చూసాను ?
"మాలో మార్పుకోసం ఎన్నో చెప్పారు. ఆలోచించుకోమంటూ సలహా ఇచ్చారు. మరి ప్రాణ స్నేహితుడు కృష్ణ విషయంలో మీరు ప్రయత్నం ఎందుకు చేయలేక పోయారు సార్ ?" అన్నాడు.
అప్పుడు నేను నవ్వుతూ 
"నా అసలు పేరు కృష్ణా రావు. కానీ నన్ను అందరూ "రావు" అనే పిలుస్తారు!" అన్నాను.

"సారీ, సార్!" అంటూ సుధీర్ ముందుకు కదిలాడు. సరళ అతన్ని అనుసరించింది.
****************
అయిపోయింది
********
తెలుగుతల్లి ...కెనడా, అంతర్జాల మాస పత్రిక వారు, 2024 లో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఏప్రిల్ 2025, తెలుగుతల్లి కెనడా, మాస పత్రికలో ప్రచురితమైన కథ.
********
రచయిత.. కె.వి.లక్ష్మణరావు
మానేపల్లి
 *జానకీకారుణ్యం..🏕️ఇంటింటిరామాయణం* 
🕉️🌻🦚💎🌹💜🌈

 *🍁జానకీ..నీకు ఎన్నిసార్లు చెప్పనూ ఇంత నెయ్యి వెయ్యద్దు ఇడ్లీలమీద అని..నీకు మంచిది అనిపిస్తే చాలా నాకు తినాలనిపించద్దా..ఆ..అని భార్య మీద విసుక్కుంటున్నాడు కారుణ్య..* 

 *నెయ్యి బలమూ, తిన్న తిండి వంటబట్టేలా చేస్తుందని నేనూ చెప్తూనే ఉంటా రోజూ మీకూ..* 
 *మీకు తిన్నది అరగాలని ఇలా నన్ను సాధిస్తుంటారు నాకు తెలుసులెండీ* *మీ ఉపాయం అంది జానకి మూతి మూడువంకర్లు తిప్పుతూ..హబ్బా పల్లెటూరి పెళ్ళామా అని విసుక్కుంటూ ఆఫీసుకి వెళ్ళిపోయాడు కారుణ్య* ..

 *అబ్బబ్బా మొద్దులా ఏంటీ ఈ అవతారం..ఎప్పుడు చూడు ఇంత పెద్ద అంచున్న చీరలేనా..కాస్త స్టయిలుగా షిఫాన్ చీర కట్టుకోవచ్చుగా, రెండుమూరల పూలొకటి అదనంగా..ఓ గులాబీ పువ్వు సింపులుగా పెట్టుకుంటే సరిపోతుంది, కళ్ళకు కాటుక, అమ్మోరులా ఇంతపెద్ద బొట్టూ..అని ఇంకా కారుణ్య జానకిని ఓ సాయంత్రం సాధించబోతే..* 

 *నాన్నా అమ్మకి ఇష్టమైనట్టు తయారయ్యింది..ఆ మాత్రం స్వాతంత్రం లేదా అమ్మకి ..ఊ..అని నేటితరం మహిళ సరయు తండ్రిని మృదువుగా అడ్డుకుంది..* 

 *బాస్ ఇంట్లో షష్టిపూర్తి ఫంక్షను..సరదా సరదా పోటీలు జరుగుతున్నాయి...అచ్చతెలుగు సాంప్రదాయంగా ఎవరొచ్చారో వారికి బహుమతి అన్నారు...జానకి నెగ్గింది...అయిదుగ్రాముల బంగారు నాణెం, బాసు దంపతులు, జానకికి బహుకరించారు..* 

 *ఏంటిప్పుడు మరి అని నవ్వుతూ కూతురు కళ్ళెగరేసింది కారుణ్యని చూసి..సరే ఒప్పుకుంటాలే అని కూతురి తల మీద చిన్నగా చేత్తో తట్టాడు కారుణ్య...వచ్చేముందు జానకి బాసు భార్యకి ఒక బాక్సు ఇచ్చింది..ఆవిడ బాక్సు తీసి చూసి అబ్బో పూతరేకులు మీరే చేసారా అంది..అవునని తలూపింది జానకి..అరే నాకూ ఇష్టమే అంటూ బాసు ఒక పూతరేకు తిని ఆహా ఏమి రుచి బాగా చేసారు థాంక్యూ అన్నాడు..ఏనుగు అంబారీ ఎక్కినంత గొప్పగా అనిపించింది కారుణ్యకి..ప్రేమగా జానకి చెయ్యిపట్టుకుని థాంక్స్ అన్నాడు నిజాయితీగా భార్యను మనసారా మెచ్చుకుంటూ..* 

 *కూతురుకి పెళ్ళయ్యింది...కొడుకుకీ పెళ్ళయ్యి కోడలొచ్చింది..కోడలు ఉద్యోగం, జానకి ఉండీలేని ఆరోగ్యం..ఇంట్లో కోపాలు, చిరాకులు షరా మామూలుగా..* 

 *జానకి నోరు ఎంత పెద్దదో కోడలొచ్చాకే అర్ధమయ్యింది కారుణ్యకి...కోడలుకి కూడా ఆఫీసు బాధ్యతలు, పైగా ఇంటిపనులు సరిగ్గా రావు..నిత్యం ఏదో ఒక గొడవే జానకికి, రూపిణికి..* 

 *ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో కొలీగ్స్ లాగా, భార్య నైసుగా లేదని పోల్చుకుని చిరాకుగా ఉండేవాడు కారుణ్య...రిటైరయ్యి ఇంట్లో ఉండేటప్పుడు భార్య ఇల్లు దిద్దుతున్న తీరు చూసి, కోడలి పనిరాని తనం చూసి..జానకి ప్రత్యేకత కారుణ్యకి అర్ధం అయ్యింది..* 

 *రూపిణికి పెళ్ళయ్యి నాలుగేళ్ళయినా పిల్లల ఊసు ఎత్తట్లేదు అని జానకికి కోపం వస్తోంది..ఒకరోజు కొడుకు వంశీని, రూపిణిని నిలదీసింది..చూడండర్రా మాకు ఓపికలున్నప్పుడే పిల్లల్ని కంటే నేను చేసుకోగలను, ఓపిక పొయ్యాక ఉద్యోగం చేసే తల్లితో పిల్లల ఆలనపాలన కష్టం అవుతుందిగా మరి..అని..* 

 *రూపిణికి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు..ప్రమోషన్ వచ్చేలా ఉంది..ఇప్పుడు కష్టపడి పనిచేస్తేనే ప్రమోషన్ వచ్చే చాన్సు ఎక్కువ, లేదంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్టు అయిపోతుందని రూపిణికి బాధ..* 

 *ఇంకో రెండేళ్ళకు రూపిణి శుభవార్త వినిపించింది...అంతే జానకి రూపిణికి సర్వ సపర్యలూ చేస్తోంది..అంతేలెండి నా కడుపులో ఉన్న మీ వారసత్వానికి ఈ జాగ్రత్తలన్నీనూ, నేను మోసే యంత్రాన్ని కదా మరి అందుకే ఇన్నిరోజులూ లేని శ్రద్ధ నా మీద మీకిప్పుడూ అని అంది రూపిణి బాధగా...అది కాదమ్మా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు..నువ్వు కూడా ఇప్పుడిలా అప్పుడలా అనిబేరీజు వేసుకుని మనసు చిన్నబుచ్చుకోకు, బిడ్డకు మంచిది కాదు అని కోడలికి స్నేహంగా నచ్చచెబుతున్న భార్యను చూసిన కారుణ్యకు జానకి ముచ్చటగా కనిపించింది...పొద్దున్నే రూపిణికి దానిమ్మపండు గింజలు వలిచి ఇచ్చేది...లంచ్ బాక్సులోకి యాపిల్ ముక్కలొకరోజు జామకాయ ముక్కలొకరోజు ఇచ్చేది..సాయంత్రం రోజూ మొక్కజొన్నె తినిపించేది..రాత్రిపూట పెద్దగ్లాసు పాలు ఇచ్చేది ఓ నేతిచుక్క వేసి మరీ...* 

 *రూపిణి నిండుగా తయారయ్యింది..ఈ మధ్య రోజూ కోడలికి ఉప్పుతో దిష్టి తీస్తోంది జానకి...* 

 *ఆ రోజు సాయంత్రం జానకీ అంటూ ఇంకా టీ తేలేదేంటీ అనుకుంటూ కారుణ్య వంటింట్లోకి వెళ్ళాడు...జానకి స్టవ్ ఉన్న గట్టు ముందు నేల మీద పడిపోయి ఉంది...జానకీ అని నీళ్ళు మొహం మీద చల్లాడు..స్పృహలో లేదు జానకి..అయ్యో అనుకుని అంబులెన్సు పిలిచి హాస్పిటలుకి తీసుకెళ్ళారు జానకిని..* 

 *హార్ట్ అటాక్ మొదటిసారి కాస్త బలంగానే పలకరించింది జానకిని...ఇహ జాగ్రత్తలు మొదలయ్యాయి జానకికి..తిండిలో కట్టుబాట్లు పనిచెయ్యటంలో ఆంక్షలు..ఇది చెయ్యొద్దు అది తినొద్దు అని రూల్స్ పాటించాల్సి వస్తోంది జానకికి..* 

 *కారుణ్య నిద్రపోతున్న భార్య పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు...నిద్రలో జానకి చెయ్యి కారుణ్య చెయ్యి మీద పడింది..ఆ చేతిస్పర్శకి కారుణ్యకి అనిపించింది..మొన్నేమన్నా జరిగుంటే నా పక్కన ఈ నా సగభాగం ఉండేదా...తను నా పక్కన లేకపోతే నా రోజులు గడిచేదెలా..పెళ్ళయ్యి ముప్ఫయేళ్ళు నాకు అంతగా నచ్చని నా భార్య ఈ రోజు ఇంత ముఖ్యం అనిపిస్తోందేంటీ...కాలంతో పాటూ బంధాల విలువ, బంధం తాలూకు అవసరం* *తెలిసొస్తాయన్నమాట...అనుకున్నాడు కారుణ్య...* 

 *సంవత్సరం తరువాత మనవరాలు ప్రియతో జానకి ఆడుకుంటోంది ..చేతుల్లో మొహం దాచి మళ్ళీ చేతులు తీసి ప్రియని చూస్తే ప్రియ కిలాకిలా నవ్వుతోంది...* 

 *కొన్నిరోజులకి జానకికి మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చింది..మూడోసారి రాకుండా చూసుకోమని డాక్టర్లు జాగ్రత్త చెప్పారు..రూపిణి ప్రియని వాళ్ళ అమ్మదగ్గరికి పంపించెయ్యాలని అనుకుంటోంది..* 

 *జానకికి బెంగగా అనిపిస్తోంది..ఎలా మనవరాలు దగ్గర లేకుండా అని..రూపిణీ మనకి ఉన్నది సరిపోతుందిలేమ్మా..నువ్వు ఉద్యోగం మానెయ్యగలవా..ప్రియని చూడకుండా ఉండలేను నేను అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది జానకి రూపిణి దగ్గర...చాలా టెన్షన్ అనిపించింది రూపిణికి..జాబ్ వదలటం ఇష్టం లేదు అలా అని అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి ప్రియతో ఉన్న అనుబంధాన్ని నిర్లక్ష్యం చెయ్యాలనీ లేదు...ఇన్నేళ్ళు ఈ అత్తగారి ఆధారం వల్లే ప్రశాంతంగా జాబ్ చేస్తోంది..మరి ఈ రోజు ఆవిడకి తన అవసరం ఉంది కానీ జాబ్ వదలాలని అస్సలు లేదు..ఆర్ధికభద్రత, తనకంటూ ఒక హోదా ఇవి వదలాలంటే బాధగా ఉంది రూపిణికి...* 

 *సాటి ఆడదాని బాధ అర్ధం చేసుకునే తత్వం సరయుది అని వదినకి ఫోన్ చేసి ఇదీ విషయం అని చెప్పి సలహా అడిగింది రూపిణి..తల్లి ఆరోగ్యం గురించి తనకీ తెలుసు సరయూకి...* 

 *పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడైనా అందుకునే అమ్మప్రేమ దూరమైతే తట్టుకోలేను ..సమయం ఉన్నప్పుడే అమ్మను కాపాడుకోవాలి అని ఆలోచించింది...భర్తతో మాట్లాడింది...తండ్రితో ఆలోచన చేసింది...* 

 *వారి ఊరిలో త్రీ స్టార్ రెస్టారెంట్ నడుపుతున్నారు సరయు వాళ్ళు..భర్తను ఒప్పించుకుని తల్లి ఉన్న ఊరికి తరలి వచ్చేసారు సరయూ వాళ్ళు,* 
 *ఈ ఊరిలో రెస్టారెంట్ ఓపెన్ చేసారు..* 

 *అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు...ఇంటిపైన ఒక అంతస్తు కట్టించి ఇచ్చాడు కారుణ్య సరయూ వాళ్ళకి...సరయు ఇంట్లో ఉండి జానకిని ప్రియని తన కొడుకు ఆదిత్యని చూసుకుంటోంది...సరయు అత్తామామా తమ ఇద్దరి కొడుకుల దగ్గరా చెరో ఆరునెలలు ఉంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు...సరయూ వాళ్ళ దగ్గర ఉండే ఆరునెలలు జానకికి, తన అత్తగారికి వచ్చే మాట పట్టింపులు నెగ్గుకురావటం ఒక్కోసారి సరయుకి కత్తి మీద సామే అయ్యేది అలాంటప్పుడు జానకికి చెప్పేది అమ్మా ప్రియ నీ దగ్గర ఉండాలంటే నీ నోరు తగ్గించుకోవే తల్లీ అని..దానితో కొన్నిరోజులు జానకి కుదురుగా ఉండేది...కారుణ్యకి చుట్టూ ఉండే బంధాల రూపంలోని ఇన్ని రకరకాల మనస్తత్వాలను గమనించడం సరదాగా అనిపించేది... ఓ పుస్తకంలో తనకు తోచిన రీతిలో ఆ అనుభవాలను విశ్లేషించి రాసుకోవడం ఓ అలవాటుగా మారింది...ఇంకో పదేళ్ళకు కూడా జానకితో ఆయన ప్రయాణం ఇంకా నడుస్తోంది చెయ్యిచెయ్యీ కలుపుకుని....*

 *_🌹సేకరణ 🌹_* 

🕉️🌻🦚🌹💜💎🌈
 23/4/ వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే ప్రపంచ పుస్తక దినోత్సవం
విలియం షేక్స్పియర్ పుట్టిన రోజైన ఏప్రిల్ 23ని యునెస్కో వరల్డ్ బుక్ డేగ ప్రకటించింది. షేక్స్పియర్ ఇంగ్లాండ్లో ఇదే రోజు 1564 లో జన్మించాడు 20వ ఏటా తనకంటే వయస్సులో పెద్దయిన యాని నీ వివాహం చేసుకున్నాడు షేక్స్పియర్ కు 15 వేల ఇంగ్లీష్ పదాలు తన నాటకాల్లో కవితల్లో పొందుపరిచాడు ఇంగ్లీషులో 37 నాటకాలు 154 కవితలు రాశాడు తన నాటకాల్లో ప్రపంచంలో ఎన్ని వృత్తులు గలవారు వారు ఉన్నారొఅన్ని రకాల పాత్రని సృష్టించాడు వినోదం కన్నా విషాదాంతమైన నాటకాలే అధికం మర్చంట్ ఆఫ్ వెన్ ఇస్ యు యు లైక్ ఇట్ కింగ్లీ నైట్ వొధ్లొలొమేక్ హమ్లెట్ మొదలైనవి ప్రముఖ 
నాటకాలు. షేక్స్పియర్ తాను పుట్టినరోజు మరణించడం ఒక వింత ఆయన మరణించిన సంవత్సరం ఏప్రిల్ 23 16 16 వ సంవత్సరం
 🍂💦😊 'సైంధవలవణం' 😊💦🍂
(ఇది నా రచన కాదు.. మీ కోసం ..నేను తెచ్చిన
...నవ్వుల నజరానాలో ప్రచురితమైన కథ.)
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
'' చూడండీ!..మీకిదే చెప్తున్నా..
నేను ఆ డాక్టర్ చెప్పిన పాపిష్టి తిళ్ళూ తినను,.అట్లాంటి డాక్టర్ చెప్పిన మందులూ మింగను. అసలు ఇంకోసారి నన్ను అలాంటి అస్తవ్యస్తపు డాక్టర్లు దగ్గరకి తీసుకువెళ్లారంటే నేను రమణమహర్షి ఆశ్రమానికి పోతా " ఇంటికి వస్తూనే విరుచుకుపడింది శాంతమ్మ గారు.
ఆ మాట అంటూనే హాల్లోనుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది ,మారుమాట్లాడే అవకాశం రామారావు గారికి ఇవ్వకుండా..
వంటింట్లోకి వెళ్లేముందు శాంతమ్మ గారు గుమ్మంలోనించే చెప్పులను కాళ్లతోనే డైరెక్ట్గా షూ రాక్ లోకి విసుగ్గా విసిరిన విసురు చూసి... మాంచి ప్రావీణ్యత గల ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కొట్టే విధానం గుర్తొఛ్చి...
కొంత దిగ్భ్రాంతికి మరింత భయ భ్రాంతికీ గురయ్యాడు రామారావు గారు.
వంటిట్లోకి వెళ్లిన శాంతమ్మగారు అదే విసురుని వంటింట్లోని పాత్రలపై ప్రదర్శిస్తున్నట్లుంది ,
'ఆకాశం నుండి స్టీలుగిన్నెల వర్షం పడుతోందా' ! అన్నట్లు శబ్దం రాసాగింది వంటింట్లోనుంచి.
ఈ హడావిడికి ..ఏంజరుగుతోందా అన్న ఖంగారుతో తన గదిలోంచి అమాంతం హాల్లోకి దూకాడు, వాళ్ళ అబ్బాయి కృష్ణ ..'ఉడికే ఉడికే బాండీ లోంచి బయటకు చిందిన కూరముక్క లాగా' .
"ఏమయ్యింది నాన్నా? " అడిగాడు ఆల్మోస్ట్ అచేతనావస్థలో నిలబడ్డ తండ్రిని కుదుపుతూ..
''ఏమయ్యిందా ? మొన్ననే 70 నిండి 71వ ఓవర్లోకి ప్రవేశించిందా మీ అమ్మ, టెండూల్కర్ లాగా డబల్ సెంచరీ కొట్టింది ,బీపీ లో .. 200 130 ఉన్నది .. ఆ డాక్టర్ ఒక పక్క అర్జెంటు గా మందులు మొదలుపెట్టమని మందులు రాసిస్తే ..వద్దంటే వద్దని నా రెక్కలు పట్టుకుని లాక్కొచ్చింది . అదేమంటే ఏమీ చెప్పకుండా ఆ డాక్టర్ ని తిట్టిపోస్తోంది .. మీ అమ్మ పెంకి తనానికి తోడు ఈ బీపీ ఒకటి , అసలే కోతి- ఆపై కల్లు తాగింది అన్నట్లుంది వ్యవహారం.." వాపోయారు రామారావు గారు
"మీరు నన్ను కోతి అనుకోండి,, పిల్లి అనుకోండి,.. కానీ ఆ డాక్టర్ పేరు నా ముందు ఎత్తకండి". వంటింట్లోనుంచి రివ్వున వస్తూ అన్నది రామారావుగారి మీద ఓ చెవి వేసుంచిన శాంతమ్మ గారు.
''ఏంటి నీ గోల శాంతం? అంత మంచి డాక్టర్ నీకెందుకు నచ్చలేదు అసలు?'' విసుక్కున్నారు రామారావు గారు.
ఓయబ్బో..కాపురం చేసే కళ కాలుతొక్కినప్పుడే బయటపడింది అన్నట్లు.. ఆయన ఎంత గొప్ప డాక్టరో బీపీ తగ్గడానికి ఆయన గారు చెప్పిన చచ్చు సలహా తోనే అర్ధమయ్యింది.. మీ ఫ్రెండ్ కొడుకని మీరేమో ఆయన దగ్గరికి తీసుకెళ్లడం.., ఆ మహానుభావుడేమో చిన్నంతరం పెద్దంతరం లేకుండా అడ్డమైన పాడు తిండ్లు తినమని చెప్పడం. ఎదో అభం శుభం తెలియని అమాయకులకు చెప్పినట్లు గా పాపం పుణ్యం ఎరిగిన నా బోటివాళ్ళకీ చెప్తే ఎట్లా అంట? అసలు నాకైతే అక్కడికక్కడే ఆ డాక్టరుని నాలుగు దులిపెయ్యాలనిపించింది కానీ ఎవరిపాపాన వారే పోతారని వదిలేసా . పోనీ మీ ఫ్రెండ్ కొడుకన్నారుగా, మీరైనా ఆ అబ్బాయిని '' పెద్దావిడని అలాంటి పాపిష్టి తిండ్లు తినమనడం ఏంట"ని మందలిస్తారేమో అంటే..తానా అంటే తందానా అంటూ ఆ డాక్టర్ చెప్పినదానికల్లా గంగిరెద్దు లాగా తల ఊపి వచ్చారాయె '' దెప్పిపొడిచింది శాంతమ్మ గారు.
"అంత చెప్పరాని సలహా ఏమి చెప్పాడమ్మా "ఆ డాక్టర్ ? అడిగాడు కృష్ణ..
''ఏమి చెప్తాడురా? మార్నింగ్ వాక్ చెయ్యమన్నాడు, పచ్చి కూరలు తినమన్నాడు, పచ్చళ్ళు, ఉప్పుకారాలు తగ్గించమన్నాడు. అందులో ఏమి తప్పుంది?'' అన్నారు రామారావు గారు.
'వాటన్నిటి గురించీ ఎవరేమన్నారు "
మరి ఇంకేంటి ?
" ఇంకేంటా..ఆ ఉప్పు విషయమే ..నాకు వళ్ళు మండుతున్నది."
"ఉప్పు ఏంటి. ?తగ్గించామన్నాడు అంతేగా ..హై బీపీ వఛ్చిన వాళ్ళని ఉప్పు తగ్గించమనక పూటకో బస్తా కంచంలో గుమ్మరించుకు తినమంటారా ?"
"ఆ మాత్రం ఉప్పు తగ్గించాలని నాకూ తెలుసు,, మా వంశం లో 5 తరాలనుండీ అందరికీ రక్తపోటు ఉందట ".
"ఆ విషయం ఇందాక నువ్వు వంటింట్లో గిన్నెలతో కధాకళీ ఆడించినప్పుడే అర్ధమయ్యిందిలే.. పైగా మీ పుట్టింట్లో అన్నీసొట్టలు పడ్డ బొచ్చలేగా ? అయినా అసలు ఆ డాక్టర్ చెప్పిన వేటితో సమస్య లేదన్నదానివి ఇందాకటినుండి ఎందుకా డాక్టర్ ని ఆడిపోసుకుంటున్నట్లు శాంతం ?
"ఎందుకేంటీ? మీరూ విన్నారుగా ? ఆ డాక్టర్ ఉప్పు తగ్గించమంటే పర్వాలేదు కానీ వాడే కొంచెమ్ ఉప్పు కూడా అదేదో దిక్కుమాలిన ఉప్పు వాడమనలేదూ? అది తలుచుకుంటేనే నా వళ్ళంతా జెర్రులు పాకినట్లుంది. అంది శాంతమ్మ గారు
"దిక్కుమాలిన ఉప్పా? నీ తలకాయ. ఆయన వాడమన్నది దిక్కుమాలిన ఉ ప్పుకాదు, దిక్పాలక ఉప్పు కాదు. దాని పేరు సైన్ధవలవనం . బీపీ వఛ్చిన వాళ్లకి ఆ ఉప్పు వాడితే మంచింది.అయినా వంశ పారంపర్యంగా బీపీ తెచుకున్నదానివి మీ వాళ్ళెవరూ సైన్ధవలవనం వాడటం తెలీదా నీకు?'' అడిగారు రామారావు గారు.
తాడంత ఎత్తున లేచింది ఆ మాటకి శాంతమ్మ గారు.
''ఛీ ఛీ , మా ఇంటా వంటా లేదు అలాంటి పాపిష్టి లవణాలు గివణాలూ తినడం. ఏమనుకున్నారో మా పుట్టింటి వాళ్లంటే .నేనెప్పుడూ అసలా పేరు కూడా వినలేదు. అయినా చీర తో పాటు జాకెట్టు, నెక్లెస్ తో పాటు దుద్దులు లాగా బీపీ తో పాటే సైన్ధవలవనం ఏమైనా సెట్ ఆ ఏంటి ? బీపీ వచ్చిన ప్రతివాళ్ళు అదీ తెచ్చుకు తిని తీరడానికి? "దబాయించింది శాంతమ్మ గారు.
"అదికాదు అమ్మా . బీపీ వచ్చినప్పుడు మాములు ఉప్పు మంచిది కాదు. అలా అని అస్సలు ఉప్పు మానేస్తే అసలుకే తిండి సహించక నీరసిస్తావు. 2 రోజులకన్నా ఎక్కువ ఆ చప్పటి తిండి తినలేవు . అదే సైన్ధవలవనం అయితే బీపీ ఎక్కువ పెంచదు, రుచీ మాములు ఉప్పు లానే ఉంటుంది '' నచ్చ్చచెప్పపోయాడు కృష్ణ ,
అబ్బా పోనిరా కృష్ణా.. బీపీ ఉంటె ఉండనీ.అదే ఓ పక్కన పడి ఉంటుంది. అంతేకానీ దానికోసం ఇప్పుడీ పాపిష్టి తిళ్లన్నీ తినలేనురా '' చెప్పింది శాంతమ్మ గారు.
''ఓ పక్కన పడి ఉండటానికి బీపీ ఎమన్నా రిటైర్ అయినా మొగుడు అనుకుంటున్నావా? వళ్ళంతా పీకి పాకాన పెడుతుంది.ఏమనుకుంటున్నావో? హెచ్చరించారు రామారావు గారు.
"అయినా అమ్మా... ఉప్పు మార్చినంత మాత్రాన అది పాపిష్టి తిండెలా అయిపోతుందమ్మా? నేనేమన్నా రేపటినుంచి దారికాచి కిడ్నాపులు, హత్యలు చేసి ఆ డబ్బుతో ఆ ఉప్పు కొంటానా? వాపోయాడు కృష్ణ.
"అదికాదురా కృష్ణా.. ఊహ తెలిసినప్పటి నుంచీ రామాయణ మహాభారతాలు చదివిస్తూ పెంచింది నన్ను మా బామ్మ. సంధ్యగొబ్బెమ్మ నోము నుండి మొన్నీమధ్య చేసిన లక్ష వ్రత్తుల నోము దాకా స్త్రీల వ్రతకథల పుస్తకంలో చెప్పిన నోములన్నీ చేసుకున్న దాన్ని నేను . పూజా పునస్కారం అవ్వకుండా పచ్చి గంగైనా ముట్టుకోను.
అలాంటిది ..ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు చేసుకున్న పుణ్యమంతా బూడిదపాలయ్యేట్లుగా నేనిప్పుడా సైన్ధవలవనం తినాలా? ఏం.. మాములు ఉప్పు తింటే ఇప్పుడే పోతానా? ఆ పాపిష్టి లవణం తింటే మాత్రం ఇంకో వందేళ్ళుంటానా ?" చిన్నబుచ్చుకున్నారు శాంతమ్మ గారు.
ఆవిడ తీరు అర్ధం కాక అయోమయంగా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు కృష్ణ రామారావు గారు.
" అది కాదు శాంతం..నువ్వు చెప్పిన నీ పుణ్యాల చిట్టా అంతా సరే గానీ సైన్ధవలవణానికి దానికీ ఏంటి సంబంధం?" అడిగారు రామారావు గారు.
బుగ్గలు నొక్కుకుంది శాంతమ్మ గారు. బోలెడంత ఆశ్చర్యం తో రామారావు గారిని చూస్తూ ...
"మీకింకా అర్ధం కాలేదా? నిజం గా ??"అడిగింది శాంతమ్మ గారు.
"నిజం శాంతం , ఒట్టు "అన్నారు రామారావు గారు.
"అయ్యో రామ!! "అంటూ తల బాదుకుంది శాంతమ్మ గారు.
"అందుకే.. నేను నెత్తీ నోరు బాదుకుని మరీ రోజూ చెప్పేది. ఈ వయసులోనైనా కొంచెం భక్తి, జ్ఞానం పెంచుకోండి. ఎప్పుడూ ఆ దిక్కుమాలిన న్యూస్ ఛానెల్స్ చూడకుండా అప్పుడప్పుడూ పురాణప్రవచనాలు వినండి అని. వింటారా మీరు..చూసిన వార్తలే చూసీ చూసీ బట్టికొట్టడం, పనీ పాట లేని వాళ్ళు నలుగురు చర్చ పేరుతో టీవీలకు ఎక్కి కొట్టుకు చస్తుంటే వినోదం చూడటం, లేదంటే ఎవరెవరో ఆడిన ఆటలన్నీ రోజంతా కూర్చుని చూడటం.... ఇహ మీకేమి అర్ధమౌతుంది నా బాధ?
అయినా ఎదో సామెత చెప్పినట్లు నా పిచ్చి గానీ మీకు ఆ మాత్రం పురాణజ్ఞానం ఉంటే ఇందాకటినుండి నాకీ ఘోషంతా ఎందుకుండేది? అక్కడే ఆ డాక్టరుని మీరే
నాలుగు అక్షింతలేసి, "నువ్వు వద్దు, నీ వైద్యం వద్దు" అని చెప్పే వారు కాదూ".. మొత్తుకుంది శాంతమ్మ గారు.
అటు తిరిగి ,ఇటు తిరిగి నా వార్తల మీద, స్పోర్ట్స్ మీద పడద్దులే కానీ... ఇంతకీ నీ పుణ్యానికీ ఆ సైన్ధవలవణానికి సంబంధం ఏంటో చెప్పి ఇంకొంచెం పుణ్యం కట్టుకో శాంతం . నీరసంగా అభ్యర్ధించారు రామారావు గారు.
"పుణ్యానికి కాదు పాపానికీ సైన్ధవలవణానికీ ఉంది సంబంధం. ఎంత పాపాత్ముడు ఆ సైన్ధవుడు ? మరి ఆ దుర్మార్గుడు సైన్ధవుడి లవణం తింటే పాపం రాదూ ? అయినా సైన్ధవుడి లవణాలు, జరాసంధుడి లవణాలు తిని మహా పాపం మూట కట్టుకోవాల్సిన అగత్యం ఏంటి నాకు ?మనం తినే ఆహారమే మనం ఏంటో నిర్ణయిస్తుంది అంటారు కదా.. ఇప్పుడు నేను ఆ రాక్షస వెధవ లవణం తిని వాడి లాగా రాక్షసి బుధ్ధులు తెచ్చుకుని అధోగతి పాలవ్వాలంటారా?
అయినా బీపీ తగ్గించడానికి ఆ డాక్టరుకి ఆ ముదనష్టపు సైన్ధవుడే దొరికాడా... కావాలంటే ఏ ధర్మరాజు లవణమో భీష్ముడి లవణమో ఇవ్వమనండి .. శుభ్రంగా తింటాను ''
ఉపోద్ఘాతం మొదలు పెట్టిన అరగంటకి అసలు వార్త మొదలుపెట్టే 24 గంటల వార్తా ఛానల్ న్యూస్ రీడర్ లాగా ఇప్పటికి అసలు విషయం బయటపెట్టింది శాంతమ్మ గారు
శాంతమ్మ గారి మాటలు విని ఒక్క నిమిషం మెదడు తిమ్మిరెక్కినట్లయింది రామారావు గారికి, ...
కృష్ణకైతే ఎముకల లోపల మజ్జలో ఎవరో దురదగుంటాకు పూసినట్లయ్యింది... ఎలా గోక్కుంటే ఆ దురద తగ్గుతుందో తెలియని అయోమయ అచేతనావస్థలో పడిపోయాడు కృష్ణ.
శాంతమ్మ గారితో ఇలాంటి విష'యాల్లో ఎక్కువ అనుభవం ఉన్న రామారావు గారే ముందు తేరుకున్నారు .
మెదడు తిమ్మిరి విదిలించి వదిలించుకోవడానికా అన్నట్లు తలని గట్టిగా పైకి, కిందికి ఊపుతూ పగలబడి నవ్వసాగారు . ఆలస్యంగా తెలివిలోకి వఛ్చిన కృష్ణకీ నవ్వు ఆగలేదు.
"ఓసి నీ ఇల్లు బంగారం కానూ.. అదా నీ గోల ఇందాకటినుంచీ.. సైన్ధవ లవణం అంటే మహాభారతం లో సైన్ధవుడికి సంబంధించిన లవణం అనుకున్నావా !! వాడేమన్నా సముద్రమా వాడి నుంచి ఆ ఉప్పు తయారవడానికి ? మనిషి. మోకాలికీ బోడిగుండుకీ సంబంధం పెట్టినట్లు సైన్ధవుడికీ ,సైన్ధవ లవణానికీ సంబంధం ఏంటే శాంతం ,, నీ తలకాయ కాకపోతే.." కడుపు పట్టుకు మరీ నవ్వసాగారు రామారావు గారు.
నిర్లక్ష్యంగా రామారావు గారి వైపు " మీ బొంద"అన్నట్లు ఒక చూపు విసిరి, భర్త కనుక మరీ డైరెక్ట్ గా ఆ మాట అనలేక ఓ నిట్టూర్పు విడిచి ,,ఇలా సెలవిచ్చింది శాంతమ్మ గారు.
"నా తలకాయా లేదు, మెడకాయా లేదు...ఎదో ఒక సంబంధం లేకపోతే ఆ లవణానికి అసలు వాడి పేరు ఎందుకు పెడతారు? ఇప్పుడూ... విదురుడు చెప్పిన నీతులకి విదుర నీతులనీ ,యక్షుడు వేసిన ప్రశ్నలకి యక్ష ప్రశ్నలనీ పేరు లేదూ..అలాగే... ఇదేదో ఆ సైన్ధవుడికి సంబంధించిన లవణమే అయ్యి ఉంటుంది. అందుకే ఆ పేరు.
అయినా చెల్లెలు వరస అయిన ద్రౌపదీ దేవిని చెరచడానికి చూసిన వాడు, ముక్కు పచ్చ లారని అభిమన్యుడి చావుకి కారణమైన వాడూ...అటువంటి ఆ సైన్ధవుడి ఉప్పు తినమన్న ఆ డాక్టరుని చెప్పుతో కొట్టాలి "... ఆగ్రహోదగ్రురాలయ్యింది శాంతమ్మ గారు..
బీపీ వలన ఆవిడకి ఆవేశం పెరుగుతోందని గ్రహించిన కృష్ణ కాసేపు ఆ విషయం పై వాదన వదిలెయ్యమన్నట్లు రామారావు గారికి కనుసైగ చేసాడు. సరే అని మౌనం దాల్చారు రామ రావు గారు.
వంటింట్లో వంట చేస్తూ ఉన్న శాంతమ్మ గారి కోడలు రుక్మిణికి హాల్లో అత్తా మామ భర్తల సంభాషణలో కొంతే వినబడింది. మిగిలినదంతా మిక్సీ కుక్కర్ ల శబ్దాలలో కలిసిపోయింది. తాను విన్నదాని ప్రకారం అత్తగారికి మాములు ఉప్పు పనికిరాదని అదేదో సైన్ధవలవణమనే కొత్త ఉప్పు వాడాలనీ మాత్రమే అర్ధమైంది రుక్మిణికి..
"మరి తెచ్చ్చారా ఆ సైన్ధవలవణమేదో..ఇస్తే అత్తయ్యగారికి విడిగా తీసిన పప్పు కూరల్లో కలిపేస్తా " అంటూ హాల్లోకి దూసుకొచ్చింది.
అప్పుడే శాంతమ్మ గారి ఆవేశం తగ్గిద్దామని ఓపక్క తమ నోళ్ళని పాకింగ్ పూర్తయ్యిన బస్తాల లాగా గట్టిగా కట్టేసుకు కూర్చుంటే..రుక్మిణి వలన మళ్ళీచర్చ మొదలై రచ్చ జరుగుతుందని భయపడ్డాడు కృష్ణ..
ఆ సైన్ధవలవణం విషయం మాట్లాడ వద్దనీ , అక్కడినుండి వెళ్లిపొమ్మనీ అర్ధం వచ్చేట్లుగా కళ్ళతో, నోటితో, చేతితో ,ముక్కుతో.. రకాలుగా సైగలు చేసాడు. కృష్ణ కూచిపూడి డాన్సర్ లెవెల్లో సర్వాంగాల్నీ సర్వదిశలకీ తిప్పి ఎంత అభినయించినా, రుక్మిణి కృష్ణ వైపు కన్నెత్తైనా చూడకుండా ద్రోణాచార్యుడి పరీక్షలో పాల్గొంటున్న అర్జునుడిలా లక్ష్యం మీదే ధ్యాస పెట్టి ..
" తెచ్చారా ఆ సైన్ధవ లవణం" అంది మళ్ళీ .
పళ్ళు బిగబట్టి, బండ గొంతుతో "లేదు, తేలేదు" అన్నాడు కృష్ణ..
తనలోని డాన్సర్ ని గుర్తించక పోయినా కనీసం తనలోని మిమిక్రీ ఆర్టిస్ట్ నైనా రుక్మిణి గుర్తిస్తుందేమో.. తన గొంతులోని తేడా గుర్తించి తన వైపు తిరిగితే మళ్ళీ సైగలు చేసి తరిమేద్దాం అన్న ఆశతో..
ఆడ అర్జునుడి అపర అవతారమైన రుక్మిణి దృష్టి మాత్రం చెట్టుమీద పక్షి కంటి నుండి...అదే సైన్ధవ లవణం నుండి ఏ మాత్రం చెదరలేదు.. తన ధోరణి కంటిన్యూ చేస్తూ అడిగింది..
''అయ్యో తేలేదా? పోనీ కిరణ్ ని పంపించి తెప్పిస్తాను,ఇంతకీ ఎక్కడ దొరుకుతుంది ఆ సైన్ధవలవణం?''
"కురుక్షేత్రం లో... పోయి తెచ్చుకో " అన్నాడు కృష్ణ ..వళ్ళు మండిపోయి..
అప్పటిదాకా ఎదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న శాంతమ్మగారు కృష్ణ మాట విన గానే ఎదో స్ఫూరించినట్లు ..రెండు చేతులు చరుస్తూ అదీ సంగతి అన్నారు..
రామారావు గారి వైపు తిరిగి చూపుడు వేలు గాలిలో ఊపుతూ.. చూసారా.. నా బాధ తెలిసిన భగవంతుడు నా కొడుకు నోటిద్వారానే నాకు క్లూ ఇప్పించాడు .
ఏమిటీ....నీరసంగా అడిగారు కొడుకు సైగల వాల్ల భార్యతో వాదించే అవకాశం కోల్పోయిన రామారావు గారు.
మీరే విన్నారుగా.. సైన్ధవ లవణం ఎక్కడ దొరుకుతుంది అంటే కురుక్షేత్రం లో అన్న కృష్ణ మాట.. అదే నిజం. కురుక్షేత్రంలో సైన్ధవుడిని అర్జునుడు చంపేసాక , అంత పాపాత్ముడికి కూడా అంత్యక్రియ లు ఎందుకని వదిలేసి ఉంటారు.. వాడి శరీరం నుంచి ఎముకలు బయట పడ్డాక ఆ ఎముకల పొడిని నూరి ఉప్పులో కలిపి మందు గా తయారు చేసుంటాడు ఆ కాలపు అతితెలివి అప్రాచ్యపు డాక్టర్ ఎవడో.. అదే సైన్ధవ లవణం .. తత్త్వం బోధించిన లెవెల్ లో తేల్చి చెప్పారు శాంతమ్మ గారికి...
ఐన్స్టీన్ కైనా అర్ధం కానీ , అనితర సాధ్యమైనట్టి ఆవిడ సమన్వయం కలిగించిన అయోమయానికి గుడ్లు తేలేసారు కృష్ణ, రామారావు గారు. తలకి ఎటువైపు నుండి మొదలు పెట్టి జుట్టు పీక్కుంటే ఎక్కువ రిలీఫ్ గా ఉంటుందో అన్న ఆలోచనలో నిమగ్నమయిపోయారు.
ఇంతలోకి .."అవునా అత్తయ్య గారూ, సైన్ధవుడు , అంత చెడ్డవాడా? "
అంటూ ధర్మసందేహాలు కార్యక్రమం మొదలుపెట్టింది పురాణాల్లో పాస్ మార్క్ జ్ఞానం కూడా లేని రుక్మిణి...
కోడలు ఇచ్చిన ఆ ప్రోత్సాహానికి ఇక తనని ఆపడం ఎవరి తరమూ కానంత స్థాయి కి వెళ్ళిపోయింది శాంతమ్మ గారు..నిత్యానంద స్వామి లెవెల్లో ప్రవచనం కొనసాగించింది.
"అవును రుక్మిణీ ! ఆ సైన్ధవ సన్నాసి చెల్లెలు వరుస స్త్రీని చెడు దృష్టితో చూడడమే కాకుండా అభిమన్యుడి మరణానికి కూడా కారకుడయ్యాడు.
నువ్వు చూసావుగా ఈ మధ్య మాయాబజార్ సినిమా కలర్ లో ..ఎంత ముచ్చటగా
ఉన్నారు నాగేశ్వర రావు ,సావిత్రీ..అభిమన్యుడు, శశిరేఖలుగా.. వాళ్ళిద్దరి పెళ్ళికి కృష్ణ భగవానుడు ఎన్ని పాట్లు పడతాడూ? అంతా కష్టపడి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే సైన్ధవుడి వలన కదూ...కాళ్ళ పారాణి ఆరక ముందే అభిమన్యుడు పోయి , శశిరేఖకి అన్యాయం జరిగిపోయింది??
మొన్నీ మధ్యే నర్తనశాల సినిమా కూడా చూపించా గుర్తుందా నీకు? అందులో శోభన్ బాబు.., అదే అభిమన్యుడు... ఉత్తర ని పెళ్లాడతాడు గుర్తుందా..పాపం ఆ ఉత్తర అయితే కడుపుతో ఉంటుంది అభిమన్యుడు పోయేప్పటికి.అంటూ కళ్లు తుడుచుకుంది శాంతమ్మ గారు.
అత్తగారు చెప్పింది అంతా విన్నాక ...ఇంతకీ సైన్ధవుడి వలన చనిపోయింది నాగేశ్వర రావో, లేక శోభన్ బాబో అర్ధం కాలేదు రుక్మిణికి.
కానీ సైన్ధవుడి వలన సావిత్రికి కష్టం కలిగింది అన్న మాట బాగా బుర్రకెక్కించుకుంది రుక్మిణి. అసలే మహానటి సినిమా చూసినప్పటినుంచీ సావిత్రి కి వీర ఘోర అభిమాని అయిపొయింది రుక్మిణి. ఎంత అభిమానము అంటే వెబ్ ఛానెల్ లో ఆ సినిమా ప్రతిరోజు చూసీ చూసీ పట్టలేనంత ప్రేరణ పొందేసింది. తాను కూడా సావిత్రిలాగా చీరలమ్మి పేదలకు సహాయం చెయ్యాలని బీరువాలో 2 చీరలని పట్టుకు బయలుదేరింది. ఎలాగొ అది పసికట్టిన కృష్ణ, వెయ్యి రూపాయిలు పెట్టి కొని వెయ్యిసార్లు కట్టిన ఆ ఇమిటేషన్ పట్టు చీరలను భార్య వీధిన పెట్టకుండా ఆపి ,కుటుంబం పరువు నిలబెట్టుకున్నాడు. ఇంకా ఇలాగె వదిలేస్తే,, తనని జెమిని గణేశన్ లాగ 4 పెళ్లిళ్లు చేసుకోమనో,,, లేక రోజు ఇంటికొస్తూ తనకోసం ఒక మందు బాటిల్ తెమ్మనో అంటుందన్న భయం తో రుక్మిణికి తెలియకుండా ఆ వెబ్ ఛానెల్ ఆన్ సబ్స్క్రయిబ్ చేసేసాడు. అయినా అప్పటికే తలకెక్కిన సావిత్రీ వీరా భిమానం మాత్రం ఎక్కడికీ పోలేదు రుక్మిణిలో .అందుకే అత్తగారు చెప్పిన అంత కథలో సావిత్రీ అన్న పేరొక్కటే వినిపించుకుంది.
"వద్దత్తయ్య గారూ..వద్దు. సావిత్రిని అంత క్షోభ పెట్టిన సైన్ధవుడిని మీరసలు క్షమించొద్దు, వాడి ఉప్పే కాదు, వాడికి సంబంధించిన ఏ వస్తువూ ఇంట్లోకి రానీయద్దు''..అంటూ ముక్కు చీదుకుంటూ ,కళ్ళు ఒత్తుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించింది.
రుక్మిణి చేసిన సావిత్రి హడావిడికి శాంతమ్మ గారూ నివ్వెర పోయారు..
తనను మించి పోయిన కోడలి పురాణభాష్యం ఆవిడకీ అర్ధం కాక హతాశులై మౌనంగా కోడలు వెళ్లిన వైపే చూస్తుండిపోయారు.
భార్య మౌనం గా ఉండటం చూసి ఆవిడ మెత్తబడిందని అపార్ధం చేసుకున్న రామారావు గారు ఇదే అదను అనుకుని మళ్ళీ రంగంలోకి దిగారు.
సహజంగా ఎవరైనా మరెవరినైనా దేనికైనా ఒప్పించాలంటే సామదానభేద దండోపాయాలను అదే వరుసక్రమంలో వాడతారు.. కానీ లోకంలో చాలా మంది భర్తలు భార్యని దేనికైనా ఒప్పించాలంటే ఆక్రమంలో రారు. అరబిక్ వ్రాస్తున్నట్లు వ్యతిరేక దిశలో మొదలు పెడతారు. మొదట అధికారం ఉపయోగించి భయపెట్టే దండోపాయంతో మొదలై.. ఆవిడ మొండికెత్తిన కొద్దీ మొదటికొస్తారన్నమాట. అందుకే చివరికి బ్రతిమిలాట లోకి దిగారు రామారావు గారు..
'శాంతీ "...అని గోముగా పిలిచారు.. ఆవిడను ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు ఏకాంతంలో పిలిచే పిలుపది
కొడుకు ముందు అలా పిలిచేసరికి ఆవిడకి చిరాకుతో చిర్రెత్తిపోయింది.
శాంతీ లేదు, వాంతీ లేదు...
ఇంకేం మాట్లాడకండి అసలు. మీ మాటలతో నాకు భ్రాంతి కలిగించాలని చూడకండి , నాకసలు ఏ డాక్టర్లు అక్కర్లేదు, ఏ మందులు అక్కర్లేదు. , అంటూ అక్కడినుంచి చివ్వున లేచి తన గదిలోకి పోయి డాంమని తలుపేసుకుంది.
ఎలెక్షన్స్ లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధిలా ...,వరల్డ్కప్ ఫైనల్ లో డక్ అవుట్ అయిన కెప్టెన్ లా.. దిగాలుగా మొహాలు పెట్టుకు కూర్చున్నారు కృష్ణ, రామారావు గార్లు.
ఇప్పుడేం చెయ్యాలి కృష్ణా.. దిక్కుతోచక దీనంగా అడిగారు రామారావు గారు.
ఏమో నాన్నా.. ఆ సైన్ధవలవణం ఏమో కానీ దాన్ని మూలంగా ఆ డాక్టర్ చెప్పిన మందులే వాడను..ఇంకే డాక్టర్ కీ చూపించుకోను అని మొండికెత్తింది అమ్మ , ఓ పక్క బీపీ ఏమో అంత ఎక్కువగా ఉంది. ఏంచెయ్యాలో ఏంటో...
అవునురా.. వెనకటికెవరో "అల్లం అంటే నాకు తెలీదా.బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడుట,అట్లా వుంది మీ అమ్మ తెలివి. విసుక్కున్నారు రామారావు గారు.
ష్..ఊరుకోండి నాన్న.. అమ్మకి వినబడిందంటే మళ్ళీ కోపం తెచ్సుకుంటుంది..అసలే బీపీ . ఎదో ఒకటి ఆలోచిద్దాంలెండి. మీరు దిగులుపడకండి...అభ్యర్ధించాడు కృష్ణ.
తల కొట్టుకుని, గొణుక్కుంటూ ఉండిపోయారు రామారావు గారు
ప్రక్క గదిలో చదువుకుంటున్న కృష్ణ కొడుకు కిరణ్ ఈ సంభాషణ అంతా విన్నాడు. వింటూనే ఓ పక్క గూగుల్ లో సెర్చ్ చేసాడు. ఏం చదివాడో ఏం చూశాడో మరి ..
బామ్మ హాల్ లోంచి వెళ్లిపోయిందని గమనించి....మెల్లిగా హాల్ లోకి వచ్చి తండ్రినీ , తాతయ్యనీ బయటకు రమ్మని సైగ చేసాడు. ముగ్గురూ ఎదో మాట్లాడుకున్నారు.
సాయంత్రం..వస్తూనే బామ్మా బామ్మా,,నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ వచ్చాడు కిరణ్.. చేతిలో ఉన్న ప్యాకెట్ చూపిస్తూ...
ఏంటిరా అంటూ వచ్చారు శాంతమ్మ గారు..
ఇదా .. హిమాలయన్ సాల్ట్ బామ్మా.. మధ్యాహ్నం ఆ సైన్ధవలవణం గురించి నువ్వు పడ్డ బాధ అంతా విన్నా బామ్మా.. నాకూ నీ మాటే నిజం అనిపించింది. అందుకే వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నా గారు ఒక మంచి డాక్టర్ ఉంటే ఆయన దగ్గరకి వెళ్ళా . ఆయన కూడా నీలాగా ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటారు. నీలాంటి పుణ్యాత్ములు అంటే ఆయనకు చాలా గౌరవం . ఆయన కూడా నీ మాటే నిజం అన్నారు.అసలు నీలాంటి వాళ్లకి ఆయనైతే ఆ సైన్ధవలవణమే ప్రిస్క్రైబ్ చెయ్యరట. నీ లాంటి భక్తుల కోసం ఎందరో ఋషులు హిమాలయాల్లో తపస్సు చేసిన హిమాలయన్ సాల్ట్ ఉందట. అది సైన్ధవలవణం కన్నా బాగా పని చేస్తుందట, పైగా అది ఋషులు తపస్సుతో సృష్టించింది కనుక తింటే పుణ్యం కూడా. చెప్పాడు కిరణ్.
పొంగిపోయింది శాంతమ్మ గారు.. మా నాయనే మా తండ్రే.. నన్ను అర్ధం చేసుకునేది నువ్వేరా నాయనా. మీ తాతయ్యకి నా గోడు తలకెక్కితే కదా.. ఆ అయ్య కుచే మీ నాన్నానూ. ఇద్దరూ కలిసి ఆ పాపిష్టి సైన్ధవలవణం తినమని నన్ను కాల్చుకు తిన్నారనుకో.. కంప్లైంట్ చేసింది శాంతమ్మ గారు.
పోనీలే బామ్మా,, నేనున్నానుగా , దిగులుపడకు, ఇంకో విషయం. నిన్ను చూసిన డాక్టర్ గారు ఆ సైన్ధవలవణం ఒక్కటే తప్పు చెప్పాడు కానీ మిగిలిన మందులు అన్నీ కరెక్టే రాసాడుట. ఈ పూట నుండే మందులు మొదలు పెట్టమని చెప్పారు ఈ డాక్టర్గారు .చెప్పాడు కిరణ్.
తప్పకుండారా నా బంగారు తండ్రీ.. అంత మంచి డాక్టర్ చెప్పాక ఇంకా నేను ఎందుకు కాదంటాను..అంటూ సంబర పడిపోయింది శాంతమ్మ గారు.
*****
డాక్టర్ చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించడం తో త్వరలోనే బీపీ కంట్రోల్ అయిపోయి, ఆరోగ్యం గా ప్రశాంతం గా అయిపొయింది శాంతమ్మ గారు.
హిమాలయాల్లో ఋషుల తపస్సు తో సృష్టించిన హిమాలయన్ సాల్ట్ మహిమే తప్ప మనుషులు చేసిన మందులకు ఇంత ప్రభావం ఉండదని మనసారా నమ్ముతోంది. మనవడికి తన పై ఉన్న ప్రేమని తలచుకుని తలచుకుని మురిసిపోతోంది.
నెల తర్వాత ఒకరోజు ఆవిడ భాగవతం చదువుకుంటుంటే.. వచ్చి ఒళ్ళో పడుకున్నాడు కిరణ్. ప్రేమ గా తల నిమిరింది శాంతమ్మ గారు.
"బామ్మా నీ బీపీ తగ్గిపోయిందిగా" అన్నాడు కిరణ్..
"అవునురా" అంది శాంతమ్మ గారు.
"ఆ హిమాలయన్ సాల్ట్ తింటే నీకేమి ఇబ్బంది లేదుగా. నువ్వు భయపడ్డావుగా ..సైన్ధవలవణం తింటే నువ్వు కూడా సైన్ధవుడి లాగ అయిపోతావని ..అలాంటి మార్పులేం రాలేదుగా" ..అడిగాడు కిరణ్.
"చక్కగా మన కోసం హిమాలయాల్లో తపస్సు చేసి ఋషులు సృష్టించిన ఉప్పు తింటే సైన్ధవుడి గుణాలు ఎందుకొస్తాయిరా... నిజానికి ఈ ఉప్పు తినడం మొదలు పెట్టాక నాకైతే ఇంకా ప్రశాంతంగా ఉంటోంది. మీ తాతయ్య తిక్క చేష్టలని కూడా కోపం లేకుండా ఓర్చుకోగలుగుతున్నాను " అన్నారు శాంతమ్మ గారు. (" నీ మొహం, అది మందులు వాడి బీపీ తగ్గించుకోవడం వల్ల , ఉప్పు వల్ల, పప్పు వల్ల కాదు "అనుకున్నారు చాటు నుండి వింటున్న రామారావు గారు. )
"బామ్మా.. నీకో విషయంచెప్తే కోప్పడవుగా" గారంగా అడిగాడు కిరణ్.
"పిచ్చి తండ్రీ. నీ మీద నాకు కోపమేంటిరా?చెప్పు "..అన్నారు శాంతమ్మ గారు.
"నిజానికి సైన్ధవ లవణం అన్నా హిమాలయన్ సాల్ట్ అన్నా ఒకటే బామ్మా".. చెప్పాడు కిరణ్..
"హదేంటిరా...? "నివ్వెరపోయింది శాంతమ్మ గారు.
"అవును బామ్మా, హిమాలయాల దగ్గరలో సింధు నది తీరా ప్రాంతం లో దొరుకుతుంది సైన్ధవలవణం. దాన్నే ఇంగ్లీషులో హిమాలయన్ సాల్ట్ అంటారు. సింధు నది ప్రాంతంలో దొరుకుతుంది కనుక సైన్ధవ లవణం అన్నారు కానీ దానికీ భారతంలో సైన్ధవుడికీ ఏమీ సంబంధం లేదు". అన్నాడు కిరణ్
:"నిజామాట్రా ?" ..ఆశర్యపోయారు శాంతమ్మగారు.
"అవును బామ్మా .. ఆ రోజు నువ్వు సైన్ధవలవణం మూలంగా మందులే వాడనంటే భయం వేసి ఇలా చెప్పాల్సొచ్చింది. నీకు అబధం చెప్పినందుకు క్షమించు బామ్మా.".
"హారి గడుగ్గాయి, మీ నాన్నకి కృష్ణ అని పేరు పెడితే ఆ కృష్ణ మాయంతా నీకు అబ్బింది రా. నేను క్షమించడం ఏమిటిరా వెర్రి సన్నాసి. మిమ్మల్నందరినీ ఖంగారు పెట్టినందుకు మేరె నన్ను క్షమించాలి. అయినా నీ అంత తెలివి, నేర్పు మీ తాతయ్యకి ఉంటే నేను ఆయన మాటా విందును." అన్నది శాంతమ్మ గారు.
"ఆహా.. మనవడి తెలివితేటలన్నీ తాత నుండి వచ్చేవేలేవోయ్"..అంటూ నవ్వుతూ చాటునుండి వచ్చారు రామారావు గారు, ఆయన వెనకే కృష్ణా..
"అమ్మయ్య !అయితే ..ఈ ఉప్పుకీ సావిత్రి ని ఏడిపించిన సైన్ధవుడికీ ఏమి సంబంధం లేదన్నమాట" అంటూ రుక్మిణీ వచ్చింది.
నవ్వులు నిండిన ఆ లోగిలి లో ఆనందాల హరివిల్లులు విరిశాయి.
🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊
****** See less
 *ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు...*

*జ్ఞాన సాగర భాండాగారం...!!*

అక్షర ముక్కల్ని అందంగా
దాచుకున్న  ప్రియా నేస్తం
మస్తిష్కానికి నుంచి మనసుకు
అల్లుకున్న అక్షరాల పద బృందం...

రాత గాడి రాతలను 
భావితరాల అందించిన అక్షరనిధి
విజ్ఞానాన్ని వినయంగా నింపుకొని
విశ్వమంతా విస్తరించిన ఆకాశం...

అక్షర ముత్యాల అపురూపంగా
దాచుకున్న నేలపైన రత్న గర్భం
సమస్తాన్ని జ్ఞానాన్ని నింపుకున్న
విశ్వంలో ప్రవాహ జ్ఞాన సాగరం....

ప్రాచీన నుండి ఆధునిక వరకు
కాలపు మైలురాళ్ళ చరిత్రకు నిదర్శనం
శాస్త్రాన్ని సాంకేతికతను ముడి వేసి
విజ్ఞాన సర్వస్వాన్ని అందించే ప్రయోగం...

గ్రంథమే విశ్వమంతా వ్యాపించి
అజ్ఞానపు మూఢత్వము తొలగించే
మస్తిష్కపు మట్టిలో పుష్పించే 
ప్రపంచమంతా వ్యాపించిన వట వృక్షం...

కాగితపు పొలములో
అక్షరాలను పండించిన క్షేత్రం
పదం వాక్యంలో పరవశించి ప్రవహించే
నాగరికత పరిమళాల నదీ ప్రవాహం..

ప్రపంచాన్ని కన్నులతో చూడకున్నా
అరచేతిలోనే దర్శింప చేసే దర్పణం
ఒంటరితనాన్ని దూరం చేసే
ఎల్లప్పుడూ తోడు నిలిచే ఆత్మబంధువు..

దగ్గరగా ఉండే ప్రియ నేస్తం
ఎల్లప్పుడూ తోడు ఉండే బంధం
నా ప్రియ మస్తిష్కపు వికాసం
సమస్త లోకాలకు జ్ఞాన అమృత భాండం..

కొప్పుల ప్రసాద్