Wednesday, 10 September 2025

 216 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకం 4

భవో$యం భావనామాత్రో న 
కించిత్పరమార్థతః|
నాస్త్యభావభావానాం భావభావ విభావినాం||

ఈ ప్రపంచమంతా భావన మాత్రమే భావానికి వేరుగా ,నిజంగా ప్రపంచం లేనేలేదు. అస్తిత్వం కలిగి ఉన్న ఆత్మా,అభావమైన జగత్తు తమ స్వభావములో నిత్యము ఉంటాయి.

అష్టావక్ర గీతలోని అనేక వాక్యాలు అత్యంతమైన ఆదరణను పొంది అనేక తత్వశాస్త్రజ్ఞులు నాలుకపై చరిస్తూ ఉండటానికి కారణం పదాల కూర్పులోని పొందిక మాత్రమే కాదు. అనంత భావ అర్థ గంభీర సౌందర్యం ఆ వాక్యాలలో ఇమిడి ఉండి ఒకసారి విన్న మళ్లీమళ్లీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందు కొక చక్కని ఉదాహరణ ఇక్కడ చూస్తున్నాం. "భవోయం భావన మాత్రః"ఈ ప్రపంచమంతా ఒక విధంగా భావనలు  మాత్రమే. ఈ వాక్యాన్ని వేదాంత బోధకులు అందరూ తరచుగా వాడుతున్నారు. మనసులోని ఆలోచనలు అణిగిపోయి అనంత సత్యములోకి జాగృతమైనప్పుడు భావ ప్రవాహంగా నామరూపాలుగా తెలియపడే ప్రపంచమంతా అదృశ్యమైనప్పుడు సాధకుడు తప్పకుండా ఇలా అనుకుంటాడు. "నకించి పరమార్థతః"... నిజంగా ఇక్కడ ఏదీ లేదు ఆత్మలేని ప్రపంచం ఎప్పుడూ తమ స్వభావాలను మార్చుకోవు అనే వేదాంత సత్యాన్ని అష్టావకులు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు.

ఆత్మ సత్యమైనది, నిత్యమైనది, పరిణామరహితము, అనంతము, ఈ ప్రపంచము అసత్యము, అనిత్యము, నిత్య పరిణామశీలి, వాటి సహజ స్వభావాలను అవి ఎన్నడూ కోల్పోవడం లేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆత్మ మాత్రమే సత్యమైనది. ఇదే నిత్యంగా ఉంటుంది .ప్రపంచము ఉనికి కలిగి లేదు. వాటి స్వభావాలు మారకుండా ఎప్పుడు అలాగే ఉంటాయి.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(212వ రోజు):--
       సీసాలో ఏముందో దానిబట్టే మనం సీసాకు 'తేనెసీసా'అనో,'పాల సీసా'అనో పేరు పెడతాంకదా. సీసా లో సిరా ఉంటే .. ఏమంటాం? (అందరూ 'సిరా'అని అరిచారు.)ఆ, సిరాసిసా! ఇదికూడా అంతే. మీ మనసులో ఎలాంటి ఆలోచన ఉంటే దానికలాంటి పేరే వస్తుంది. అల్లరి చేసే ఆలోచనలుంటే, అది అల్లరి మనసన్నమాట ; అంచేత, చేసేవన్నీ అల్లరిపనులే అవుతాయి. మంచి ఆలోచనలుంటే, మంచి మనసని అర్థం ; అప్పుడు పనులెలాంటి వౌ తాయి ? (అందరూ 'మంచివి'అని గట్టిగా అరిచారు) అంతే. మీకిప్పుడు తెలిసిందికదా, మంచిగా ఉండట మెలానో - మంచి ఆలోచనలూ, మంచి పనులూ . 
       చిన్మయమిషన్ ఉపాధ్యాయు లకు నిర్వహించిన చాలా సదస్సు లలో మొట్టమొదటిది బొంబాయిలో ఐదవతరగతి విద్యార్థులకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయుల కోసం జరిగింది ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసే ఉపా ధ్యాయుల శిక్షణకోసం ఏర్పాటుచేసి న ఈ కార్యక్రమం వారికి తమ ధార్మికవారసత్వం గురించి వివరిం చి, వారిద్వారా విద్యార్థులకు కూడా దానిని అందజేయటం కోసం నిర్దే శించబడింది. రెండు వారాలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రవేశరుసుమేదీ లేదు; కాని, వారు తమకున్న సెలవురోజులు దీనికి వినియోగించాలి. 
       పాఠం చెప్పేవారికీ, ఉపాధ్యా యులకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరిస్తూ స్వామీజీ తన ప్రారంభోప న్యాసాన్ని మొదలుపెట్టారు. పాశ్చా త్య విద్యావిధానాన్నే ఈనాడు మన దేశంలోకూడా అనుసరించడం దురదృష్టకరమైన విషయమని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఈ విద్యావిధానం పిల్లల మనసులో ఎన్నో విషయాలు కుక్కి అవి పరీక్ష లయ్యేంతవరకూ అక్కడ నిలిచి ఉండటంమీదనే ఆధారపడుతుంది. "ఇది విద్యకానేకాదు." అని స్వామీజీ గర్జించారు. తర్వాత, విద్య అంటే ఏమిటో వివరించారు. 
       విద్యద్వారా లభించిన జ్ఞానం వివేకంగా పరిణమించి, బలమైన వ్యక్తిత్వంగా రూపునందుకోటానికి ఉపయోగపడాలి. విద్యావిధానం లో ఉపాధ్యాయుని నడవడి, వ్యక్తి త్వం అత్యంతప్రధానమైన పాత్ర పోషిస్థాయి. ఉపాధ్యాయుడు సామా న్యమైన రీతిలో విద్యార్థులు మన్నన పొందితే చాలదు; నిజమైన భయ భక్తులతో కూడిన గౌరవాభిమానాల ను సంపాదించాలి. విద్యార్థీ, ఉపా ధ్యాయుడూ మానసికంగా దగ్గరై, విద్యార్ధితన బుద్ధిజ్ఞానంతో ఉపాధ్యా యుని ఔన్నత్యాన్ని గ్రహించినపుడే అది సాధ్యపడుతుంది. అటువంటి గౌరవాన్ని ఉపాధ్యాయుడు పొంద లేకపోతే, విద్యార్థికి నేర్పినదేదీ చిర కాలం ఉండే ఫలితాన్నీయదు. 
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 3️⃣1️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*39. ఏషా తే2భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణుl*
 బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి॥

అర్జునా! ఈ సమత్వధావనను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగము ఆధారంగా అంటే జ్ఞానము ఆధారంగా చెప్పాను. యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఒక యోగంగా ఆచరిస్తే అదే కర్మయోగము అవుతుంది. ఆ కర్మయోగము ఆధారంగా ఈ సమత్వభావనను ఎలా ఆచరించవచ్చో చెబుతాను విను. ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మబంధనములను దూరంగా నెట్టివేయగలవు. దాని వలన నీకు జ్ఞానం కలుగుతుంది. అని చెప్పాడు కృష్ణుడు.

(ఇక్కడ సాంఖ్యము అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానమును గురించి చెప్పబడే తత్త్వము, జ్ఞానయోగము అని అర్థం చేసుకోవాలి.)

అర్జునా! ఇప్పటి దాకా నీకు జ్ఞానయోగము గురించి, ఆత్మ జ్ఞానము గురించి చెప్పాను. అంటే సాంఖ్యము గురించి చెప్పాను. ఇక్కడి నుండి కర్మయోగము గురించి క్లుప్తంగా చెబుతాను అని అన్నాడు. ఇక్కడ మీకు ఒకసందేహము రావచ్చు. అన్నీ జ్ఞానముతోనే సంక్రమిస్తాయి; జ్ఞానమే ముఖ్యము; జ్ఞానముతోనే ఆత్మతత్వము బోధపడుతుంది అని తెలుసుకున్నాము కదా! ఇప్పుడు ఈ కర్మయోగం ఎందుకు అని సందేహం వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరికి పరిమిత జ్ఞానము ఉంటుంది. మరి కొందరికి విశేష జ్ఞానము ఉంటుంది. కొంత మంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తుంటారు. మరి కొంత మంది అపరిమితమైన ఆసక్తితో చేస్తుంటారు. మరి కొంత మంది నిష్కామంగా, కర్మలను ఒక యోగంగా ఆచరిస్తారు. ఎవరైనా సరే ముందు కర్మయోగము అవలంబించిన తరువాత జ్ఞానయోగానికి వెళ్లాలి. పరిమిత జ్ఞానము కలవారు మొదట కర్మయోగము అవలంబించి కొంత జ్ఞానముసంపాదించి తరువాత మెట్టు ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి కర్మయోగము మొదటి మెట్టు అయితే జ్ఞానయోగము రెండవ మెట్టు అని అనుకోవచ్చు.

కలియుగంలో జ్ఞాన సముపార్జన కష్టం, కానీ మోక్షము జ్ఞానముతోనే కలుగుతుంది. జ్ఞానం కలగాలంటే మొదట కర్మయోగం అభ్యసించి తరువాత జ్ఞానయోగము అనే మెట్టు ఎక్కాలి. కాని మనకు ఒక అపోహ ఉంది. కలియుగంలో కేవలం రామనామ స్మరణ కానీ పరమాత్మ నామ స్మరణ కానీ చేస్తే మోక్షం వస్తుంది అని. మనస్సును శుద్ధి పరచుకోడానికీ, గతజన్మ పాపఫలముల నుండి విముక్తి పొందడానికీ, కొత్తగా కర్మలు చేసి ఆ ఫలములు మూటకట్టుకోకుండా ఉండటానికి పరమాత్మ నామస్మరణ ఉపయోగపడుతుంది కానీ కేవలం నామ స్మరణతో మోక్షం రావడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.

అర్జునా! నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా. ఆ సమత్వం జ్ఞాన పరం గానే కాక కర్మ వరంగా కూడా చేయవచ్చు అది ఎలాగో నీకు వివరిస్తాను. ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంటబట్టించుకొని ఈ కర్మబంధనముల నుండి విముక్తుడివి కా! అంటూ తరువాతి శ్లోకంలో ఇప్పుడు చెప్పిన దానిని విపులీకరించి చెప్పాడు కృష్ణుడు.

*40. నేహాభిక్రమనాశో2స్తి ప్రత్యవాయో న విద్యతేl*
 *స్వల్పమష్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ll*

ఏ కర్మనైనా నిష్కామంగా, ఒక యోగంగా చేస్తే, దానికి ఎప్పటికీ అపజయము ఉండదు. విపరీత ఫలితములు ఉండవు. అన్నీ మంచి ఫలితములే కలుగుతాయి. పైగా ఈ నిష్కామ కర్మ యోగమును పూర్తిగా ఆచరించక పోయినా పర్వాలేదు. ఎంత చేస్తే అంతవరకే ఫలితం ఇస్తుంది. ఏ కొంచెం సాధన చేసినా అది మనలను మృత్యు భయం నుండి కాపాడుతుంది.

ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి. అప్పుడే చెప్పబోయే విషయం చక్కగా అర్థం అవుతుంది. దానినే భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు. కర్మయోగము అంటే మానవ జీవన విధానము. బయట మనం ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తాము. కాని లోపల అంతా కల్మషంగా ఉంటుంది. కాని లోపల కూడా అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన, కర్మయోగములు. చాలా మందికి ఎంతో ఐశ్వర్యం సంపదలు చుట్టు జనం ఉంటారు. కాని ఒంటరి తనం ఫీల్ అవుతుంటాడు. ఏదో తెలియని వెలితి. ఏదో కావాలని తపన. మనశ్శాంతి కొరకు పరితపిస్తుంటారు. ఆ మనశ్శాంతి ఇదిగో ఈ జ్ఞాన కర్మయోగములు ఆచరిస్తే దొరుకుతుంది అని భగవానుడు చెబుతున్నాడు. ప్రస్తుతం అర్జునుడు అదే అశాంతితో బాధపడుతున్నాడు. ఏదో జరిగిపోతుంది అని ఆవేదన చెందుతున్నాడు. దానిని పోగొట్టడమే కృష్ణుడి కర్తవ్యము. మనశ్శాంతి మనయొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుందేకానీ, మనకు ఉన్న సిరి సంపదల వల్ల కాదు అని కర్మయోగం బోధిస్తుంది. సుఖం ఎక్కడో లేదు. మనకు ఉన్న ధనము, ఆస్తి, పదవి, సంపాదన వీటిలో లేదు. ఇవి ఎన్ని ఉన్నా నిరంతరం దుఃఖంతో బాధపడేవాళ్లు ఉన్నారు. సుఖం మనలో ఉంది. మన ఫీలింగ్ లో ఉంది. మన మనసులో ఉంది. కాని మనం దానిని నమ్మము. మనకు అంగబలం అర్ధ బలం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అనే అపోహలో ఉంటాము. ధనం కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ ఒక మేరకు ఉంటే పర్వాలేదు. అమితంగా ఉంటే అదే అన్ని దు:ఖములకు కారణం అవుతుంది. కాబట్టి ధనము, ఆస్తి, బంగారము, అంగ బలము శారీరక సుఖాన్ని ఇస్తాయోమో కానీ, మానసిక సుఖాన్ని మానసిక ఆనందాన్ని ఇవ్వవు.

ఈ కర్మయోగం అనుష్ఠానం చేస్తే ఎవరికీ అపజయమే ఉండదు. చేసిన కర్మలకు విపరీత ఫలితములు కూడా రావు. సక్రమమైన ఫలితములే వస్తాయి. ఎలాగంటే మనం కర్మలను మెటీరియలిస్టిక్ గా చేస్తాము. కర్మను కర్మగానే చేస్తాము. కాని కర్మను ఒక యోగంగాచేస్తే అంటే పరిశుద్ధమైన చిత్తముతో చేస్తే దాని వలన అపజయం కాని, విపరీత పరిణామాలు కానీ ఉండవు. ఏవేవో కోరికలు కోరుకుంటూ కర్మలు చేస్తే, ఆ కోరికలు తీరక పోతే విపరీత పరిణామాలు సంభవిస్తాయి. కానీ నా ధర్మం నేను చేస్తున్నాను. ఏం ఫలితం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను, పరమాత్మ ప్రసాదం అనుకుంటాను అని కర్మను ఒక యోగంగా చేస్తే, విపరీత పరిణామలు అంటూ ఏమీ ఉండదు. పైగా ప్రతి అపజయం నుండి తిరిగి జయం పొందడానికి కావలసిన పాఠాలు నేర్చుకుంటాడు.

ఈ కర్మయోగము పూర్తిగా ఆచరించవలసిన అవసరం లేదు. కొంచెం ఆచరించినా చాలు ఆ జనన మరణ భయం నుండి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే, ప్రాపంచికమైన కర్మలు పూర్తిగా చేస్తేనే కానీ నీకు ఫలితం దక్కదు. కానీ ఈ కర్మయోగము చిత్త శుద్ధితో నిష్కామంగా చేస్తే, కొద్దిగా ఆచరించినా పూర్తి ఫలితం ఇస్తుంది. ఒక కోటీశ్వరుడు ఏదో పుణ్యం వస్తుందని కోటి రూపాయలు దానం చేస్తే వచ్చే ఫలం, ఒక సామాన్యుడు ఆకలితో ఉన్న వాడికి కడుపు నిండా అన్నం పెడితే వచ్చే ఫలితం కన్నా తక్కువే. క్లుప్తంగా చెప్పాలంటే కర్మను కోరికతో చేస్తే బంధనములు కలిగిస్తుంది. అశాంతిని కలిగిస్తుంది. కర్మను కోరికలేకుండా చేస్తే శాంతిని కలిగిస్తుంది. కర్మ బంధనముల నుండి మోక్షమును కలిగిస్తుంది.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P89
 🔔 *తీర్థ యాత్ర* 🔔

*తిరువణ్ణామలై*

🙏 అరుణాచలేశ్వర స్వామి క్షేత్రం 🙏

🏞️ క్షేత్ర మహిమ
తమిళనాడులోని తిరువణ్ణామలై లో వెలసిన అరుణాచలేశ్వర స్వామి ఆలయం శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు అగ్ని లింగరూపంలో వెలసి ఉన్నాడు. ఇది అగ్ని స్థలము గా ప్రసిద్ధి.

📖 పురాణ నేపథ్యం
ఒకసారి బ్రహ్మ – విష్ణువులకు సృష్టి – స్థితి పరాక్రమంపై గర్వం వచ్చింది. ఆహంకారాన్ని తొలగించడానికి శివుడు అనంత జ్వాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు.
విష్ణువు వరాహరూపం తీసుకొని క్రిందికి వెళ్ళినా ఆది కనబడలేదు.
బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్ళినా అంతం కనిపించలేదు.

ఈ అనంత జ్వాలారూపమే అరుణాచల పర్వతం గా నిలిచింది. శివుడు సాక్షాత్తు ఈ పర్వతరూపంలో భక్తుల పాలిట వెలుగుతున్నాడు.

🕉️ ఆలయ వైభవం
ఆలయం గోపురాలు అద్భుతమైన ద్రావిడ శైలిలో నిర్మించబడ్డాయి.
ప్రధాన లింగం అరుణాచలేశ్వరుడు – ఆయన సాక్షాత్తు జ్వాలరూపం.
అమ్బాళుగా అపిత కుచాంబా అమ్మవారు దర్శనమిస్తారు.
ఆలయం చుట్టూ ఉన్న గిరివలయం (14 కిమీ) ఎంతో పవిత్రమైనది. భక్తులు అర్ధరాత్రి, పౌర్ణమి రోజున దీన్ని భక్తితో ప్రదక్షిణ చేస్తారు.

🌼 పండుగలు
కార్తిక దీపం: సంవత్సరంలో ఒకసారి, కార్తిక పౌర్ణమి రోజున, పర్వత శిఖరంపై మహాజ్యోతి వెలిగిస్తారు. ఇది విశ్వానికి వెలుగు, శివుడి అనంతత్వానికి సంకేతం.
మహాశివరాత్రి, ఆడి పూరం వంటి పండుగలు కూడా గొప్పగా జరుగుతాయి.

🚶 యాత్రికులకు సూచనలు
గిరివలయం చేయడం అత్యంత పుణ్యకార్యం. ఇది భక్తునికి ఆత్మశుద్ధిని ఇస్తుంది.
ఆలయ దర్శనం ముందు స్వచ్ఛతతో స్నానం చేయాలి.
కార్తిక దీప సమయంలో లక్షలాది భక్తులు చేరతారు – ఆ ఉత్సవాన్ని జీవితంలో ఒక్కసారి తప్పక అనుభవించాలి.

✨ తీర్థయాత్ర ఫలితం
తిరువణ్ణామలై యాత్రచేసినవాడు, జీవనంలో అహంకారాన్ని విడిచి, జ్ఞానజ్యోతి వైపు అడుగులు వేయగలుగుతాడు. అరుణాచలేశ్వర దర్శనం భక్తునికి మోక్ష సాక్షాత్కారం అందిస్తుంది.

 శ్రీమద్ రామాయణ కల్పవృక్షం గ్రంథానికి తెలుగు లో తొలిజ్ఞానపీఠం అందుకున్నారు. ప్రసిద్ధ కవి, పండితుడు. వేయిపడగలు, చెలియలి కట్ట, ఏకవీర, నర్తన శాల, ఆంధ్రప్రశస్తి, కిన్నెరసాని పాటలు వంటివి వీరి ప్రసిద్ధ రచనలు. ఈ రోజు కవి సమ్రాట్” 
 విశ్వనాథ సత్యనారాయణ జయంతి  జ్ఞాపకం !

     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

విశ్వనాథ సత్యనారాయణ గారు 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను ఆలంబనగా ఉంటుంది. వారు తిరుపతి వెంకట కవులు ద్వయానికి చెందిన ప్రముఖ తెలుగు రచయిత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి విద్యార్థి. విశ్వనాథ ఆధునిక, శాస్త్రీయ శైలిలో, సంక్లిష్ట రీతుల్లో రాశారు. ఆయన ప్రసిద్ధ రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (రామాయణం కోరికలు తీర్చే దివ్య వృక్షం), కిన్నెరసాని పాటలు (మత్స్యకన్య పాటలు), నవల వేయిపడగలు (ది థౌజండ్ హుడ్స్) ఉన్నాయి. అనేక అవార్డులలో, ఆయన 1971లో పద్మభూషణ్ పురస్కారం, తెలుగు సాహిత్యంలో తొలి
 నేటి మంచిమాట

పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి కానీ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం బలం ఏమిటో.

ఒక మంచి పుస్తకం ఎలా అర్థంకాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థంకాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే అర్థం చేసుకోవాల్సిందే.

మిత్రులారా! నీతులు నీడని ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కానీ ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్ధాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. అందుకే రోజుకొక మంచిమాట పంపడం జరుగుతుంది.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
 *హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి*

ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.
అపారమైన శివ భక్తుడు.అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు.చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు.చరిత్రలో నిలిచిపోయారు.

“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి.సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”
 
👌 *2. మైత్రి యొక్క విలువ!*

వంచన తో..బలం తో..భార్యను,భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా
హనుమ ఒక్క నాటికి లేరు.
తన దారి తానూ చూసుకోలేదు.న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి…ఉన్నారు.

“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు…వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”
 
👌 *3. అహం బ్రహ్మాస్మి*-నేనే గొప్ప అని అనకు! నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!

లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..! నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరంలో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే…రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది!అటువంటి రామ బాణం లా వెళతాను!”నేను…నా వల్ల ,నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!
 
👌 *4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!*
కొన్ని లక్షల వానర సేన!
నూరు యోజనముల సముద్రం!
జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు!
తలచుకుంటే కాని పని కాదు!కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!

“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”
 
👌 *5. మోసం చేసేవాళ్ళు ఉంటారు.నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!*
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!
“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి
అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని,ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని
వెళ్ళండి “అని అంటుంది.
హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా?మాయ లా ఉంది?ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి,లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ
చేసుకున్న ప్రమాణం.”
 
👌 *6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.*
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ
రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా
కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి.వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…
ఇవన్నీ చూస్తున్నా…..
హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ?ఎన్ని కస్టాలు పడుతోందో అని…!
మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి
సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.

“లక్ష్యం సాధించడం లో గురి…
చేసే పని లో పట్టుదల…
పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”
 
👌 *7. పెద్దరికాన్ని గౌరవించు*
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి
చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు.
నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.
హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”
 
*హనుమ కథ లో*…వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి.ప్రతి ఊరి పొలిమేరల్లో గద పట్టుకుని నిలబడి….”ఏం భయం లేదు రా...నీకు తోడుగా నేనున్నానులే……పద “..అని తెలిపే ఆంజనేయ విగ్రహాలే...

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏