21-11-2025,
""శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవాను పశ్యతా""
ఓ వాలి మహారాజా! శ్రద్ధగా ఆలకించవయ్యా! నేను నీకు విధించిన శిక్షని నీ అంత్యకాలములో అది అన్యాయమని భావించక ప్రశాంతముగ న్యాయమని స్వీకరించు.కారణము నేను నీకు వేసిన శిక్షని ధర్మమార్గము ననుసరించి వేసాను.నేను అనుసరించిన ధర్మము నా పూర్వీకులు అనుసరించిన మార్గమే. అందుకే అయ్యది ధర్మ మార్గమని గ్రహించు.
రామాయణము కిష్కిందాకాండములో రాముడు వాలిని శరముతో గాయపర్చగా రాముడు వాలితో సంభాషిస్తు,
"" అవశ్యం పితురాచారః""
పూర్వీకులొనర్చిన ధర్మకార్యాచరణని ఆచరింపవలెనని పల్కి వాలిని ఓదార్చితుండగా దానికి ఆ వానరేశ్వరుడు బదులుగ ఓ రామా!, నీది న్యాయమా! అంటు,
""ఆధార్యం చర్మమే సద్భీ రోమాణ్యస్థి చ వర్జితం ,
అభక్ష్యాణి చ మాంసాని త్వద్విధైర్థర్మ చారిభిః||(17-36)
మరణావస్థను భరిస్తూ వాలి రామునితో ఇలా అంటాడు.
ఓ రామా! స్పృహదప్పిన వానిని పాము కాటు వేసినట్లుగ చాటునదాగి నన్ను వధించావు.కోతుల మాంసము ఎవ్వరు తినరు,చర్మము ఎముకలు నీకు గానీ మరెవ్వరికి గానీ ఉపయోగపడవు.నీకు నాకు పూర్వ వైరము లేదు.కనుక నీవు చేసినది అధర్మమని రామునిపై అపవాదు వేసి
"" చర్మ చాస్థి చ మే రాజన్ న స్పృశంతి మనీషిణః,
అభక్ష్యాణి చ మాంసాని సో~హం పంచనఖో హతః||(17-38),
ఓ రామా! నీకు తెలియదా! ముళ్లపంది, వరాహము,ఉడుము,తాబేలు,కుందేలు అను ఐదు మాత్రమే భక్షింపదగినవి.నేను ఐదుగోళ్ల జంతువునే అయినప్పటికి నా మాంసము తినుటకు నీకు పనికి రావుగదయ్యా! అని విలపిస్తున్న వాలితో ,
శ్రీరాముడు స్పందిస్తు ఆ వానరేశ్వరునితో ఓయీ! వినవయ్యా!
"" త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం రోషమాస్థితః|,
ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితమ్|.""(18-45).
ఆవేశములో యుండి నన్ను నిందించవలదు."
"రాజా రాష్ట్రకృతం పాపమ్,"
ప్రజలు చేసిన పాపకార్యముల ఫలితము రాజు అనుభవింపవలసియుండును. నా సోదరుడు భరతుని పాలనలో యున్న ఈ ప్రదేశములో జరిగిన పాపకార్యాన్ని నేను ప్రక్షాళన చేయకపోతే ఈ పాపము రాజైన నా భరతుడు అనుభవించబలసియుండునని చెప్పి , వాలి చేసిన తప్పులన్నిటిని తెలియచేసి పాపము చేసిన వారిని శిక్షించుట రాజధర్మము.కనుక నిన్ను వధించుట నా కర్తవ్యము అని వాలిని ఊరడిస్తాడు.
పాపకార్యాల పట్ల ప్రతిఒక్కరు విముఖతను కలిగియుండాలని రాముని పాత్ర ద్వారా రామాయణము మనకి తెలియచేస్తున్నది కనుక మనమెల్లరము సన్మార్గగాములమై చరించాలి.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
Sri K P Sarma Garu.💐🙏
No comments:
Post a Comment