నమో రమణ
అరుణాచల సాధువుల సాంగత్యం : వివరణ
సాధువుల మధ్య సాధన, అహంకారము..... ఇలాంటి మాటలు మధ్య కొంత సంభాషణ జరిగింది. అది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేయగలము......
"ఏ మంచి పని అయినా అహంకారం లేకుండానే చేయాలి" అని రమణ మహర్షి సెలవిస్తే, "అహంకారంతో చేసిన మంచి పని కూడా బంధాన్ని కలిగిస్తుంది" అని శ్రీరామకృష్ణులు సెలవిచ్చారు కదా!
ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం :
ఒక 5 సంవత్సరాల పాప రమణాశ్రమం వచ్చింది. సోఫాలో ఉన్న మహర్షి ఆ పాపను చూసి "అరే మాతృశ్రీ గారు వచ్చారే!" అని సెలవిచ్చారు అంట. ఆ పాపే కాలాంతరంలో "మాతృశ్రీ జిల్లెల మూడి అమ్మగా" గుంటూరు జిల్లా పరిసర ప్రాంతంలో {జిల్లెళ్ళమూడి} ఎంతో ప్రసిద్ధి చెందారు కదా! "సాధన" అంటే "చేయించబడేది" అని మాతృశ్రీ గారు అంటూ ఉంటారు కదా!
సాధన విషయంలో మాతృశ్రీ గారి భావన ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? అని ఇక్కడ సాధువులు అంటూ ఉంటారు.
ఇక్కడ ఒక విషయం చూద్దాం :
దైవానుగ్రహముతో 2009లో రమణాశ్రమం రావడం జరిగింది నేను. మా ఇంట్లో ఉన్న పరిస్థితి కారణంగా ఒక ఆరు నెలలు మాత్రమే ఉండి పోదామని వచ్చాను. ఈ ఆరు నెలలు అనుకున్నది కాస్త 16 సంవత్సరాల అయిపోయింది ఇప్పుడు. ఈ 16 సంవత్సరాల రమణాశ్రమ సాధనలో అంచెలంచెలుగా ఈశ్వరుడు, నన్ను ముందుకు నడిపించాడు అని చెప్పవచ్చు.
మొదటి ఆరు నెలలు ఎక్కువగా ఒక రోజుకి రెండు అరుణగిరి ప్రదక్షిణాలు చొప్పున సాగడం.. గుడుల పంచన, రోడ్డు పక్కన, రమణాశ్రమ భిక్షాన్నముతో జీవించడం .... తర్వాత మూడు నాలుగు సంవత్సరాలపాటు కాస్త ఉపనిషత్తులతోపాటు(వేదం) ఎక్కువగా ఒక రోజుకి రెండు ప్రదక్షిణాలు ... ఆ కాలంలో రమణాశ్రమ గ్రంథాలయాన్ని విరివిగా ఉపయోగించుకోవడం...
మొదటి ఐదు సంవత్సరాల తర్వాత అనుకోకుండా కాలునొప్పి కారణంగా నడక ద్వారా ప్రదక్షిణ చేయలేని స్థితిలో ఆధ్యాత్మిక పేపర్లు వ్రాసి భక్తులకు చేరవేయడం.... ఆ తరువాత కాలంలో ఏకాదశ రుద్రం.... రుద్ర నమక గణ పారాయణం..... ఇట్లా ఎక్కడా ఆపకుండా ఈశ్వరుడు సాధన చేయిస్తూనే ఉన్నాడు అని చెప్పవచ్చు..... మా ఇంట్లో వారు మొదటి నుంచి మనం ఇక్కడ ఉండటానికి వారి అనుగ్రహమే అని చెప్పవచ్చు... ఇదే ఈశ్వరుని యొక్క అపార కరుణకు నిదర్శనం. "తల్లి తండ్రి సంతోషపడనిదే ఏ ఆధ్యాత్మిక సాధన కూడా ముందుకు సాగదు" అని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు కదా!
ఇక్కడ ఒక విశేషం ఏమంటే; ఈశ్వరుడు తన అనుగ్రహాన్ని మా ఇంట్లో వారి మీద కురిపించాడు అని చెప్పవచ్చు! లేకపోతే ఇక్కడ మన సాధన సరిగా సాగేది కాదేమో.......! ఎందుకంటే ఇక్కడ మన కళ్ళముందే సాధన కోసం వచ్చిన ఎంతో మంది యువకులు వెళ్లిపోయారు... వారు వెళ్ళిపోతున్న సమయంలో మనకి కూడా వెన్నులో వణుకు పుట్టేది... కానీ ఈశ్వరానుగ్రహం, మా తల్లిదండ్రుల అనుగ్రహం నన్ను ఇక్కడ నిలబెట్టింది అని చెప్పవచ్చు.
ఒక విషయం మనం గమనించాలి : మహర్షి జీవించి ఉన్నప్పుడే మహర్షి ముందే ఎంతో మంది సాధకులు వెళ్లిపోయారు కదా! ఇక మనం ఎంతటి వారం? అహం పైకి లేస్తే వెళ్ళిపోవడమే అని మహర్షి అంటూ ఉంటారు కదా!
నమో రమణ
No comments:
Post a Comment