Wednesday, 10 September 2025

 *✍🏼 నేటి కథ ✍🏼*


*కోతి చెప్పిన నీతి*


సువర్ణపురం అనే రాజ్యానికి ఇంద్రవర్మ అనే రాజు ఉండేవారు. విస్తారమైన సువర్ణపురం చాల సంపన్నమైంది. కానీ రాజుకి రాజ్యమంతా తిరిగి పర్యటించి తన ప్రజల కష్టసుఖాలు విచారించే సమయం లేదు. తన రాజ్యంలోనే ఉన్న ప్రకృతి అందాలని చూసి ఆనందించాలని ఆసక్తి లేదు. కారణం రాజుకి పొరుగు రాజ్యాలలో విహరించే ఆసక్తి ఉండడమే.

ఇంద్రవర్మ ఎప్పుడు వివిధ రాజ్యాలను పర్యటించే వాడు. కానీ తన రాజ్యంలో కొంత భాగమైన చూసింది లేదు. ఇది ఇలా ఉండగా, ఒక రోజు రాజు విహారానికి బయల్దేరి, తన రాజ్యంలోని అడవిలో విశ్రాంతి కొరకై ఆగుతాడు. తన దగ్గరలోనే ఒక కోతిని గమనిస్తాడు. అది రాజు ఫలహారం చేసి మిగిలిన వేరుశెనగకాయల్ని తీసుకొని చెట్టు పైకి ఎక్కి తినసాగింది. అలా తింటూ ఉండగా, కోతి చేతి నుండి ఒక వేరుశెనగకాయ కింద పడుతుంది. ఆ ఒక్క కాయ కోసం, తన చేతిలోని కాయలన్ని పడేసి కిందకి దిగుతుంది. ఇదంతా గమనిస్తున్న రాజు చూసి నవ్వసాగాడు. కోతి కోపంతో, ఎందుకు నవ్వుతున్నావ్? అని అడిగింది. అప్పుడు ఇంద్రవర్మ "ఒక్క కాయ కోసం అన్నీ వదులుకున్నావ్ నువ్వెంత వెర్రిదానివి!" అని అన్నాడు. వెంటనే కోతి "నన్ను వెర్రిదానినని అంటున్నావుగా, మరి నువ్వు చేసేది కూడా అదేగా. మన రాజ్యంలోని అందాలని ఆనందించకుండా, ప్రజల కష్టసుఖాలని విచారించకుండా పక్క రాజ్యాలని పర్యటిస్తూ ఉంటావు కదా" అని అంది.

ఇంద్రవర్మకు జ్ఞానోదయం అయింది. తాను చేసేది తప్పు అని తెలుసుకొని, విదేశీ పర్యాటనికి స్వస్తి చెప్పి, తన రాజ్యం మంచి చెడ్డలు చూసుకోసాగాడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment