Tuesday, 30 September 2025

 237 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 25

కృతం దేహే న కర్మేదం న మాయా  శుద్దరూపిణా|
ఇతి చింతానురోధీ యః కురువన్నపి కరోతి న||

చైతన్యమయమైన ఆత్మౄ తన్నుతాను గుర్తిస్తూ తనలో సంస్కారానుగుణంగా కదిలే భావాల వల్ల శరీరము పనిచేస్తున్నదని తానేమి చేయడం లేదని తెలుసుకున్న జ్ఞాని కర్మలను ఆచరిస్తున్న చేయనట్లే.

కర్మ అనగానే కేవలము శరీర అవయవాల కదలిక మాత్రమే కాదు. ఆ కర్మను నిర్ణయించే బుద్ధి అహంకారం ఉన్నప్పుడు మాత్రమే కర్మ జరుగుతుంది. గాఢ నిద్రలో నీ గురువును కాలితో తన్నినా సరే అది నీ పనిగా గుర్తింపబడదు. చిన్నపిల్లల పనులకు కూడా వారిని కర్తగా భావించి నిందించము. బుద్ధిలో కదలిన భావాల అనుగుణంగా అహంకారంతో గుర్తిస్తూ చేసిన పనులు మాత్రమే మన కర్మలుగా గుర్తింపబడుతాయి.

జీవన్ముక్తుడు కూడా సదా ఆత్మ జాగృతుడు అయి ఉండటముతో అతని మనశ్శరీరాలు వాసనానుగుణంగా పనిచేయటాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. సముద్రంలోని అలల వలె అతనిలోనే భావాలు కదులుతూ ఉండడానికి అతడే ఆధారమైన, అతని దృష్టిలో రెండవది ఏది లేనేలేదు .గుర్తించే అహంకారం లేకపోవడంతో కర్మ ఫలాన్ని స్వీకరించే వారు కూడా ఉండరు. కాబట్టి అష్టావక్రమహర్షి "కురువన్నపి కరోతి న"... అతడు పనిచేసిన చేయనట్లే అని అంటున్నారు.

భగవద్గీత అంతటా ఇదే భావము నిమిడీకృతమై ఉంది. ఉపనిషత్తులన్నీ ఇదే భావాన్ని దృఢంగా చెబుతున్నాయి. మనదేశంలో మహర్షులు మహాత్ములు అన్ని కాలాలలోనూ ఈ సత్యాన్ని అనుభవ సహితంగా అనేక విధాల అందించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనినే జీవన్ముక్తిగా వర్ణిస్తున్నారు.🙏🙏🙏

No comments:

Post a Comment