*హిందూ ధర్మం - 7*
------------------
*వేదం - 7*
వేదం ప్రత్యేకించి ఒక మతాన్నికానీ, భావజాలాన్ని కాని వ్యాప్తి చేయదు, చెప్పదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది.
ఉదాహరణ చెప్పాలంటే బైబిల్ క్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేస్తుంది, దేవుడు ఒక దైవదూతను పంపాడని, ఆయన చెప్పిందే ఆచరణయోగ్యమని, ఇతరులు చెప్పిందంతా అసత్యమని ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది.
ఖూరాన్ను నమ్మేవారంతా ముస్లింలు అని, తమ మతప్రవక్త మాటలే సత్యమని, అన్యమతస్థులను కాఫిర్లు అంటూ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది.
కానీ వేదంలో అటువంటి ప్రత్యేకమైన భావజాలం మచ్చుకు కూడా కనిపించదు. వేదం ఏం చెప్పినా సమస్త మానవాళిని, విశ్వాన్నిఉద్దేశ్యించి చెప్తుంది.
*'మనుర్భవ - కృణ్వంతు విశ్వమార్యం'* : ముందు మనుష్యులుగా మారండి, విశ్వం మొత్తాన్ని శ్రేష్టతరమైనదిగా చేయండి అంటుంది.
అట్లాగే గుడ్డిగా నమ్మమని కూడా వేదం ప్రవచించదు, ఒక దేవుడిని నమ్మమని కూడా చెప్పదు. సత్యాన్ని శోధించండి, సత్యాన్ని తెలుసుకోండి, అనుభూతి చెందండి అంటుంది.
అటువంటి వేదాన్ని అర్దం చేసుకోవడంలో భాగంగా వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు.
*1*. మంత్రసంహిత
*2*. బ్రాహ్మణం
*3*. ఆరణ్యకం
*4*. ఉపనిసత్తు
*1*. *సంహిత*:
*సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై* - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. సంధి అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదము నందున్న శాస్త్రమును సంధించునది సంహితము.
(సంహితమ్ = కూడుకొనునది). మంత్రాలన్నీ కలిపితే సూక్తం అవుతుంది, సూక్తలన్నీ కలిపితే సంహిత అవుతుంది.
నిజానికి భగవంతుని ద్వారా ఇవ్వబడిన భాగమే వేదసంహిత. దీనినే వేదమని అంటారు.
దీని గురించి మరింత విపులంగా తరువాయి భాగంలో చెప్పుకుందాం.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment